గత ఏడాది ఉల్లి ధర ఏ రేంజ్లో మనకు కన్నీళ్లు పెట్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఈ ఏడాది పరిస్థితి మారిపోయింది. ఉల్లి ఈ సారి వినియోగదారులకు కాకుండా పంట పండించిన రైతులకు కన్నీళ్లు పెట్టిస్తోంది.
ఔను హైదరాబాద్ మొదలుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉల్లి ధరలు దారుణంగా పడిపోతున్నాయి. హోల్సేల్ మార్కెట్లలో కిలో రూ.3 నుంచి రూ.9లోపే రేటు పలుకుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
సహజంగా ఆగస్టు నెలలో ఉల్లి పంట చేతికి వస్తున్నప్పుడు ధర తక్కువగా ఉంటుంది. అయితే, ఇప్పుడు మరీ దారుణంగా ఉందని అంటున్నారు. గత ఏడాది ఆగస్టు నెలలో హోల్సేల్ మార్కెట్లో కిలో ఉల్లి రూ.18 నుంచి రూ.31 వరకు పలికింది. కానీ గురువారం హోల్సేల్ మార్కెట్లో రూ.2.89 నుంచి రూ.9.89 మధ్య రేటు పలికింది. యావరేజీగా రూ.6 వరకే ధర వచ్చింది. గత ఏడాది కంటే నాలుగైదు రెట్లు తక్కువగా ధర పలికింది.
పంట చేతికి వచ్చినప్పటికీ కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఉల్లిపంట దిగుబడులపై ప్రభావం పడుతోంది. వర్షాల వల్ల ఉల్లి పంటను తీయడం ఇబ్బందిగా మారింది. మరోవైపు ఉల్లి మడుల్లోనీరు నిలిచి గడ్డలు మురిగిపోయే పరిస్థితి ఉంది. కష్టపడి తీసి లారీల్లో మార్కెట్కు తరలించినా సరైన ధర రావడం లేదు.
కొత్త ఉల్లిగడ్డలకు ధర రాకపోవడంతో హైదరాబాద్ మార్కెట్లకు తీసుకువస్తే లారీల కిరాయి కూడా మిగలడం లేదని రైతులు తేవడం లేదు. ఎక్కడికక్కడ లోకల్ మార్కెట్లకే పంటను తరలిస్తున్నారు. దీంతో లోకల్ మార్కెట్లలో ఉల్లికి డిమాండ్ తగ్గి మంచి ధరలు రావడం లేదు. మరోవైపు కరోనా ఎఫెక్ట్ వల్ల హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది జనం సొంతూళ్లకు వెళ్లి పోవడంతో సిటీలో కూడా ఉల్లికి డిమాండ్ తగ్గింది. దీంతో ఇక్కడి మార్కెట్లలో సైతం ఉల్లికి డిమాండ్ లేక ధరలు తగ్గినట్లుగా తెలుస్తోంది.