Paritala Sunitha: ఏ ఎన్నికల్లోనైనా అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చేది ఆయా పార్టీల అధినేతలే.వారు అధికారికంగా ప్రకటించి బీఫారాలు ఇస్తేనే ఆ అభ్యర్థులు ఆయా పార్టీల తరపున పోటీకి నిలబడటం జరుగుతుంది.
బీఫారాలిచ్చిన అభ్యర్థులకే ఆయా పార్టీల ఎన్నికల గుర్తులను కూడా అధికారులు కేటాయిస్తారు.ఇది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ఇటీవల టిడిపిలో చోటుచేసుకొన్న ఒక పరిణామం కారణంగా ఇప్పుడు ప్రస్తావించాల్సి వస్తోంది.మాజీ మంత్రి పరిటాల సునీత వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు శ్రీరామ్ పోటీ చేసే నియోజక వర్గాన్ని తనంతట తానుగానే ప్రకటించడం అనేది టిడిపిలో ప్రకంపనలు రేపుతోంది.
ఇప్పటివరకూ ఇలా జరుగుతోంది!
ఎవరు అవునన్నా కాదన్నా టిడిపి కి కర్త కర్మ క్రియ చంద్రబాబునాయుడే.ఆ పార్టీలో ఆయన ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదని ప్రతీతి.టీడీపీ పై ఆయనకు అంత పట్టు ఉందన్నది నిర్వివాదాంశం.ఎన్నికల్లో అభ్యర్థులకు టికెట్ ఇచ్చే విషయంలో చంద్రబాబుదే తుది నిర్ణయం.ఇప్పటి వరకు అలాగే జరుగుతూ వస్తోంది.కానీ పరిటాల సునీత తాజా ప్రకటనతో ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
Paritala Sunitha: సునీత ప్రకటన వెనక నేపధ్యం!
అనంతపురం జిల్లా టీడీపీలో పరిటాల రవీంద్రకు ఒక ప్రత్యేక అధ్యాయం ఉంది.ఆయన బతికినంతకాలం పెనుగొండ నియోజకవర్గాన్ని ఏలారు.రవీంద్ర దారుణ హత్య అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన ఆయన భార్య సునీత తొలుత పెనుకొండలోనే గెలిచారు.2009 లో పెనుగొండ ఎస్సీలకు రిజర్వు కావడంతో ఆమె రాప్తాడు నియోజకవర్గానికి మారారు. 2009,2014 ఎన్నికల్లో రాప్తాడు నుంచి గెలిచారు.2019 లో సునీత పోటీ చేయకుండా తన కుమారుడు పరిటాల శ్రీరామ్ ను టిడిపి అభ్యర్థిగా రాప్తాడు నుంచి పోటీ చేయించారు.శ్రీరాం వైసిపి అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.ఈ రెండున్నరేళ్లలో ప్రకాశ్ రెడ్డి నియోజకవర్గంలో మరింత బలపడ్డారు.శ్రీరామ్ అక్కడ పుంజుకోలేక పోయారు.
ప్లాన్ మార్చిన తల్లీకొడుకులు!
దీంతో పరిటాల సునీత తన కుమారుడికి సురక్షితమైన నియోజకవర్గంగా ధర్మవరంలో గుర్తించి అక్కడ పాగా వేసే ప్రయత్నాలు మొదలెట్టారు.ఇటీవలి కాలంలో ఆ నియోజకవర్గం లో తల్లీకొడుకులు విస్తృతంగా పర్యటించారు.పాత కాంటాక్ట్ లను లైన్ లో పెట్టారు. ధర్మవరం శ్రీరామ్ కు కాస్తంత సేఫ్ నియోజకవర్గంగా సునీత కు గురి కుదిరింది.ఆ వెంటనే ఆమె ప్రెస్ మీట్ పెట్టి వచ్చే ఎన్నికల్లో శ్రీరామ్ ధర్మవరం నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించేశారు.
అవాక్కైన టీడీపీ శ్రేణులు!
పరిటాల సునీత ప్రకటనతో టిడిపి శ్రేణులు దిగ్భ్రాంతి చెందాయి.ఆమెకు ఆమే తన కుమారుడికి నియోజకవర్గాన్ని ఎంచుకుని ప్రకటించేయటం ఏమిటన్న చర్చ పార్టీలో మొదలైంది.ఇలా ఎవరికి వారే నియోజకవర్గాలను ఎంపిక చేసుకుంటే ఇక పార్టీ అధిష్టానవర్గం ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.చండశాసనుడు వంటి చంద్రబాబు కు పార్టీపై గ్రిప్ పోయిందా అనే అనుమానాలను కూడా సునీత రేకెత్తించారు.ఇంకా విచిత్రమేమిటంటే చంద్రబాబు ఇప్పటివరకు సునీత ప్రకటనపై ఏ విధంగానూ స్పందించలేదు.మొత్తంగా చూస్తే టిడిపి పడవకు ఇప్పుడిప్పుడే చిల్లులు పడుతున్న సంకేతాలు గోచరిస్తున్నాయి.