ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.
క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల ఆందోళనలు జరుగుతున్నా, కోర్టు కేసులు ఎదురవుతున్నా, విపక్షాల విమర్శల పరంపర సాగుతున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ముందుకే వెళుతోంది. అయితే, తాజాగా సినీనటుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ మాత్రం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలన్న అభిప్రాయానికి కట్టుబడి ఉన్నట్లు జనసేన పేర్కొంది. హైకోర్టు ఆదేశాలతో దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ వివరాలు వెల్లడించింది.
రాజధాని అదే… 13 జిల్లాల సంగతి ఏంటంటే..
రాజధానిపై హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కీలక అంశాలను జనసేన పార్టీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తూ 13 జిల్లాలను సమగ్రాభివృద్ధి చేయాలన్నది జనసేన అభిప్రాయంగా అఫిడవిట్ లో తెలిపారు. మూడు రాజధానుల ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి.. రాజ్యాంగ, న్యాయపరమైన ప్రాతిపదిక లేదంటూ తన అభిప్రాయాన్ని హైకోర్టుకు జనసేన పార్టీ తెలియజేసింది. ప్రభుత్వం చట్ట సభల సాంప్రదాయాన్ని, రూల్స్ ని అతిక్రమించి బిల్లులను ఆమోదింపచేసుకుందని పేర్కొంది.
చంద్రబాబు, జగన్ మధ్య…
రాజధాని అంశం ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రుల మధ్య వ్యక్తిగత గొడవగా మారిందని జనసేన పార్టీ అభిప్రాయపడింది. ఆధునిక ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రతీకారేచ్ఛతో కూడిన విధానాలను అనుమతించరాని జనసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. చెడు విధానాలు, చెడు పరిపాలన ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తాయని జనసేనా అఫిడవిట్ విశ్లేషించింది. రాజకీయాలు విధానపరమైన నిర్ణయాలను శాసించ కూడదని, ఏపీకి అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలన్నది తమ అభిప్రాయమని ఈ అఫిడవిట్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిని రాజధానిగా ప్రతిపాదించినపుడు అన్ని రాజకీయ పక్షాలు మద్దతిచ్చాయని పవన్ కల్యాణ్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వంపై నమ్మకంతో రాజధాని నిర్మాణం కోసం అమరావతి రైతులు తమ భూములను త్యాగం చేశారన్నారు. గతంలో అమరావతికి మద్దతిచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చాక తన అభిప్రాయం మార్చుకుందని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
వర్కవుట్ అవుతుందా?
జనసేన పార్టీ రాజధాని విషయంలో తమ వైఖరిని తెలియజేయడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సహజంగానే ఈ నిర్ణయాన్ని అమరావతి ప్రాంత రైతులు, అమరావతి రాజధాని మద్దతుదారులు స్వాగతిస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం పవన్ కళ్యాణ్ అమరావతి కోసం ఇంకా కృషి చేయవచ్చునని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్రపక్షమైన పవన్ కళ్యాణ్ ఆ పార్టీతోనే అమరావతికి మద్దతుగా మాట్లాడివచ్చు కదా? అంటూ పేర్కొంటున్నారు. కేంద్రం తన వైఖిరిని అమరావతికి మద్దతుగా తెలిపితే మరింత అండగా దొరికినట్లు అవుతుందని విశ్లేషిస్తున్నారు. దీనిపై పవన్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.