Antarvedi : అంతర్వేది రథం అగ్నికి ఆహుతై ఆరు నెలలవుతున్నా దర్యాప్తు అతీ గతీ లేకుండా మారింది. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు కారణం విద్రోహమా? ప్రమాదమా? అనేది ఇప్పటివరకు తేలకపోవడం మిస్టరీగా మిగిలింది. రాష్ట్రవ్యాప్తంగా హిందు సంఘాలు, భక్తుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించినా ఇంతవరకు అతీగతీలేదు.
అసలు సీబీఐ ఈ కేసు దర్యాప్తునకు సుముఖంగా ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. లేఖ రాసిన తర్వాత విచారణ ప్రారంభం కాకపోయినా ప్రభుత్వం సైతం ఇంతవరకు ఒత్తిడి తేచ్చే ప్రయత్నం చేయలేదు. అటు పోలీసు శాఖ చేపట్టిన దర్యాప్తు సైతం ఎంతవరకు వచ్చిందనేది కూడా వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో రథం ఆహుతి వెనుక ఏం జరిగిందనేది అంతుచిక్కని మిస్టరీగా మారింది. కాగా సీఎం శుక్రవారం అంతర్వేది పర్యటనకు వచ్చి వెళ్లినా రథం ఆహుతి ఘటన దర్యాప్తు గురించి అధికారులతో సమీక్షించిన దాఖలాలు లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Antarvedi :అసలేం జరిగిందంటే!
గతేడాది సెప్టెంబరు 5 అర్ధరాత్రి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం అగ్నికి ఆహుతైంది. స్వామి వారి రథం ఆహుతవడం వెనుక కుట్ర ఉందా? ప్రమాదవశాత్తూ జరిగిందా? అనేది మిస్టరీగా మారింది. పైగా ఘటన జరిగిన సమయంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, భద్రతా సిబ్బంది విధుల్లో లేకపోవడం వెనుక కావాలనే ఈ ఘటన జరిగిందనే అనుమానాలు రాష్ట్రవ్యాప్తంగా తలెత్తాయి. అటు రథం భద్రతపై ప్రభు త్వ నిర్లక్ష్యంపై అనేక జిల్లాల్లో హిందూ సంఘాలు అప్పట్లో భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ఫలితంగా పోలీసుశాఖ ఆగమేఘాలపై ప్రత్యేక విచారణ చేపట్టింది. కొన్నిరోజులపాటు వరుసగా అనేకమంది అనుమానితులను విచారించింది. అదే సమయంలో విచారణ తీరును నిరసిస్తూ ద్రోహలను పట్టుకోవాలని డిమాండ్తో దేవాలయం వద్ద ఆందోళనలు పెరిగాయి. దీంతో ఉద్రిక్తతలను చల్లార్చేలా, కేవలం ప్రమాదం వల్లే రథం కాలిపోయిందంటూ పోలీసుశాఖ కొత్త వాదన బయటకు వదిలింది. ప్రాథమిక ఆధారాల ప్రకారం తేనెతుట్టు కోసం పెట్టిన మంట రథానికి విస్తరించి ఆహుతైందని ఒకసారి, మతిస్థిమితం లేని వ్యక్తుల వల్ల జరిగిందని ఒకసారి, మద్యం మత్తులో ఎవరో ఇలా చేశారని పోలీసుశాఖ రోజుకో ప్రకటన వెల్లడించింది. ఇదికాస్తా దర్యాప్తుపై అనుమానాలు పెంచడంతోపాటు భక్తుల్లో మరింత ఆందోళన, అనుమానాలకు దారితీసి ఉద్యమం పెద్దదయ్యేలా చేసింది. దీంతో ప్రభుత్వం దిగివచ్చి ప్రమాదం వెనుక కుట్రను తేల్చే బాధ్యతను సీబీఐ కు అప్పగిస్తూ గతేడాది సెప్టెంబర్ 10న నిర్ణయించింది.
సిబిఐ కి ఇచ్చి చేతులు దులుపుకున్నారు!
సీఎం జగన్ ఆదేశాల మేరకు డీజీపీ కేంద్రహోంశాఖకు లేఖ రాశారు. దీంతో కాకినాడ నుంచి పోలీసులు రథం దగ్థానికి సంబంధించినన కేసు ఎఫ్ఐ ఆర్లు, వాంగ్మూలాలు, తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిన విషయాలకు సంబంధించిన మొత్తం రికార్డులను ఢిల్లీకి తీసుకువెళ్లి సీబీఐకి అప్పగించారు. ఇదంతా జరిగి ఇప్పటికి ఆరు నెలలవుతోంది. కానీ దర్యాప్తు ప్రారంభం కాలేదు. దీంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పాత రథం స్థానంలో ఇప్పటికే కొత్త రథం కూడా సిద్ధమైంది. అయితే ఇన్ని రోజులవుతున్నా అసలు సీబీఐ ఈకేసుపై అసలు ఎందుకు విచారణ ప్రారంభించలేదు. అసలు దర్యాప్తు చేయడానికి సుముఖంగా ఉందా? లేదా? అనేది సైతం అంతుచిక్కడం లేదు. పైగా ఆరునెలలు అవుతుండడంతో కేసుకు సంబంధించి ఆధారాలు, క్లూస్ కూడా చాలావరకు బలహీనమయ్యాయి. సీబీఐ నుంచి స్పందన లేకపోవడంతో ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సి ఉన్నా అదీ జరగలేదు. దీంతో సీబీఐ దర్యాప్తుపై ఆశలు వదులుకోకతప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోపక్క సీబీఐ దర్యాప్తు జరగకపోయినా పోలీసు శాఖ మాత్రం దర్యాప్తు కొనసాగిస్తుందని డీజీపీ వెల్లడించారు. పురోగతి లేని దర్యాప్తుపై సీఎం సమీక్షించి ఆదేశాలు ఇవ్వాలని భక్తులు డిమాండు చేస్తున్నారు.