vizag :విశాఖ ప్లాంట్ పై వైసీపీ ఎంపీ చేసిన ప్రసంగం కొత్త చర్చకు దారి తీసింది. లాభాపేక్ష లేకుండా వ్యాపారం చేయలేం, జీతం తీసుకోకుండా ఉద్యోగం చేయలేం.. అసలు ఉపయోగం లేదంటే ఏ పనీ చేయం. వ్యక్తిగత జీవితంలో ఇవన్నీ నిజాలే. కానీ.. వ్యవస్థ బాగు కోసం పని చేసేటప్పుడు లాభాపేక్ష చూడకూడదు.. ఉండదు కూడా. ఆటోమేటిగ్గా వచ్చేయాలంతే..! ఈ లాజిక్కే మర్చిపోయారు ఏపీ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. గురువారం విశాఖలోని టౌన్ షిప్ లో జరిగిన విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ బహిరంగ సబా వేదికపై ఇందుకు ఉదాహరణగా నిలిచారు. తాను చెప్పాలనుకున్నది చెప్పారో.. పార్టీకి అనుకూలంగా మాట్లాడారో.. ఏం మాట్లాడుతున్నారో.. సందర్భం ఏంటనేది మర్చిపోయారో కానీ. ఎంపీ గారు అసలు సమస్యను పక్కనపెట్టేసి రాజకీయం మాట్లాడేశారు. దీంతో సభ అసలు లక్ష్యం దెబ్బతీసి రాజకీయ రణరంగంగా మార్చేశారు ఎంవీవీ సత్యనారాయణ.
విశాఖ ఉక్కులో ‘ప్రత్యేక హోదా’..
అఖిలపక్షాలతో జరిగిన సమావేశం కాబట్టి ఈ సభా వేదికపై వైసీపీతోపాటు కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు. వీరిలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ కూడా పాల్గొన్నారు. అసలు ఇందుకు ఆజ్యం పోసిందే శైలజానాధ్. పార్టీలకతీతంగా పాల్గొన్న ఈ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించి మాట్లాడుతూ.. ఏకంగా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ఇంతమంది ఎంపీలున్నా ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదని.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే గంటలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. లేదంటే ప్రాణత్యాగానికి కూడా సిద్దమంటూ ప్రకటించారు. శైలజానాధ్ వ్యాఖ్యలకు చిర్రెత్తిపోయిన వైసీపీ ఎంపీ తానేం తక్కువ కాదంటూ ఉద్వేగభరితం అయిపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించిందని.. ఆ నిర్ణయంపై కేంద్రం పునరాలోచన చేయాలని సీఎం జగన్ లేఖ రాసారన్నారు. కార్మికులు చేస్తున్న ఉద్యమంలో పాల్గొంటున్నాం. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన మీరు మాట్లాడతారా? వాస్తవాల్ని మరచి హీరోయిజం చూపిస్తూ అసలు విషయాన్ని పక్కకు తప్పించడం సరైనది కాదు.
ఆవేశంలో వైసీపీ ఎంపీ ఏం మాట్లాడారంటే..
ఇంతటి ఆవేశంలో ఎంపీ సత్యనారాయణ అసలు విషయం మర్చిపోయారు. చాలా రోజుల తర్వాత అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న తాపత్రయమో.. ఉత్సాహమో కానీ.. జనాలు మర్చిపోయిన కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఉన్న శైలజానాధ్ తన వాణి వినిపించేశారు. ఇది రాజకీయ వేదిక కాదు.. చేయాల్సిన ప్రసంగం ఇది కాదు. ఒక సమస్యపై అందరూ కలిసి పోరాడాల్సిన సందర్భం. విశాఖ ఉక్కుకూ.. ప్రత్యేక హోదాకు సంబంధం లేదు.. ఈ సమస్యకు రాహుల్ గాంధీ ప్రధాని కావాడమే శరణ్యం అన్నట్టు ప్రసంగించి తన అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఆయనే అనుకుంటే.. నిత్యం సీఎం జగన్ భజన చేసే ఆ పార్టీ నేతలకు తమ పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకునే సందర్భంలా కూడా ఈ వేదికను మార్చేశారు. తాము 25 మంది ఎంపీలు ఉంటే కాంగ్రెస్ కు 100 మంది ఎంపీలు ఉన్నారు కదా అనేశారు. పాదయాత్ర చేస్తే స్టీల్ ప్లాంట్ వచ్చేస్తాదా.. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటుందా..? అని సభా ప్రసంగం చేశారు.
జగన్ భజనే కానీ.. ప్లాంట్ అంశమేది..
నిజానికి కాంగ్రెస్ కు అసలు ప్రచారం చేసుకునేందుకు డబ్బులు లేవు. పార్టీ ఫండ్ లేదు. ఎవరు అభ్యర్ధిగా నిలబడతారో అని చూసే పరిస్థితి ఉన్న కాంగ్రెస్ ను తమకు పోటీగా భావించినట్టు మాట్లాడటం వైసీపీ ఎంపీ సత్యనారాయణ తప్పు. తమ 22 మంది ఎంపీల్లో ఉత్తరాంధ్ర వారు తప్ప మిగిలిన ప్రాంతాల్లోని ఎంపీలే ఈ సమస్యకు ఒక్కతాటిపైకి రాలేదు. దేశంలోని మిగిలిన ఎంపీలు ఎందుకొస్తారు. ఉన్న 22 మందితో పార్లమెంట్ ను స్తంభించడమో.. పార్లమెంట్ బయట దీక్షలు చేయడమో.. వాకౌట్.. నిరసనలు చేయడమే చేయాల్సింది పోయి.. ఇక్కడ కాంగ్రెస్ ను టార్గెట్ చేయడమే పెద్ద కామెడీ. పాదయాత్రలు, దీక్షలు చేస్తే కేంద్రం దిగి వస్తుందా? అని తన ప్రసంగంలో స్లిప్ అయిన ఎంపీకి కేంద్రం తన నిర్ణయం మార్చుకోదు అని ఫిక్స్ అయిపోయారా? అనే అనుమానాలూ రాకపోవు. బాబూ.. ఇది రాజకీయ వేదిక కాదు అని ఉక్కు పరిరక్షణ సభ్యులు వారిస్తున్నా కూడా వినలేనంత లీనమైపోయారు ఎంపీ. స్టీల్ ప్లాంట్ ఆవిర్భావ వేడుకలను బహిష్కరిస్తూ.. పరిరక్షణ దినంగా భావిస్తూ కార్మికులు ఏర్పాటు చేసిన సభ ఇలా రసాభాస అయిపోవడం.. సమస్యలపై మన రాజకీయ నేతల చిత్తశుద్ధికి నిదర్శనం అనాలి.