Punganur: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఇంటిపై ఈరోజు పోలీసులు దాడులు నిర్వహించారు. ఆయన నివాసంతో పాటు చుట్టుపక్కల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు జరిపారు. పోలీసులు దాడి చేసిన సమయంలో రామచంద్ర యాదవ్ ఇంట్లో లేరని తెలిసింది. ఆయన నివాసంలో పెద్ద ఎత్తున ఉన్న కిట్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తొంది. పోలీసుల చర్యలను బీసీ యువజన పార్టీ నేతలు తప్పుబడుతున్నారు.
ఈ ఘటనపై బీసీ యువజన పార్టీ అధినేత బొడె రామచంద్ర యాదవ్ స్పందిస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. జిల్లాలో కొంత మంది పోలీసులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ లబ్దికోసమే పని చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. మహిళలకు చీరలు పంపిణీ చేస్తే లిక్కర్ పంచుతున్నామంటూ తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. పుంగనూరులో జరుగుతున్న అరాచకాలను పోలీసు ఉన్నతాధికారులు గుర్తించాలని రామచంద్ర యాదవ్ కోరారు.
తమ పార్టీ మెంబర్ షిప్ డ్రైవ్ లో పాల్గొన్న కార్యకర్తలకు పంపిణీ చేసేందుకు తెప్పించిన కిట్ లను పోలీసులు స్వాధీనం చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. తాము కొనుగోలు చేసిన వాటికి పూర్తిగా బిల్లులు కూడా ఉన్నాయన్నారు. తప్పుడు ఆరోపణలతో తమ ఇంటిపై దాడి చేసి వాటిని సీజ్ చేయడం దారణమన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడే పోలీసులు తగిన మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని ఆయన హెచ్చరించారు. వీటిపై తాను న్యాయపోరాటం చేస్తానని అన్నారు. ఇలాంటి పిరికి పంద చర్యలకు తాను వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు.
TS EAPCET: తెలంగాణ ఈఏపీసెట్ షెడ్యుల్ విడుదల