ఉమ్మడి కృష్ణాజిల్లాలోని వైసీపీ నాయకుల్లో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా పార్టీ అధిష్టానం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని నాయకులు బెంబేలెత్తుతున్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అనేక సంచలన మార్పులు చేసిన వైసీపీ.. ఇప్పుడు కృష్ణాజిల్లాపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. కీలకమైన.. ముఖ్యంగా టీడీపీ ఎక్కువగా దృష్టి పెట్టిన నియోజకవర్గల్లో మార్పులకు ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలో గుడివాడ, గన్నవరం, విజయవాడ పార్లమెంటు సీట్లపై ఒక్కసారిగా చర్చ ప్రారంభమైంది. గుడివాడ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఫైర్బ్రాండ్ నాయకుడు కొడాలి నాని ఉన్నారు. అయితే.. ఈ దఫా ఈయనను ఇక్కడ నుంచి తప్పించనున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఇప్పటికి నాలుగు సార్లు గుడివాడ నుంచి విజయం దక్కించుకున్న నానిని మారుస్తున్నారన్న వార్త రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈయన ప్లేస్లో ప్రస్తుతం కృష్ణాజిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న హనుమంతరావును తీసుకువస్తున్నారని తెలుస్తోంది.
దీనికి సంబంధించి.. వైసీపీ నిర్ణయం కూడా తీసేసుకుందని.. ప్రకటనే తరువాయని అంటున్నారు. అయితే.. దీనికి నాని ఏమేరకు ఒప్పకుంటారనే చర్చ సాగుతోంది. ఇంతలోనే మరో వార్త తెరమీదికి వచ్చింది. కొడాలి నాని ని గన్నవరం నుంచి పోటీ చేయించాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, గన్నవరం నుంచి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పార్లమెంట్ అభ్యర్ధిగా పోటీకి పంపిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
అయితే.. విజయవాడ పార్లమెంట్ కు పోటీ చేయడానికి వంశీ విముఖత వ్యక్తం చేస్తున్నారని మరో సమాచారం వస్తోంది. అయితే.. ఒకవేళ వంశీని విజయవాడ నుంచి పోటీకి పెట్టేటట్టయితే.. మరి ప్రస్తుతం ఎంపీగా ఉండి.. ఇటీవలే వైసీపీలో చేరిన కేశినేని నాని పరిస్థితి ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఇదే టికెట్ దక్కుతుందని.. ఆది నుంచి ప్రచారంలో ఉంది. పైగా.. 5వ జాబితాలోనూ .. వైసీపీ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా కేశినేనికి బాధ్యత అప్పగించింది. కానీ, ఇంతలోనే ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయని వార్తలు రావడం గమనార్హం. మరి ఈ గందరగోళానికి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.