puducherry : పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీకి షాక్ ల మీద షాక్ ఇస్తున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. ముఖ్యమంత్రి నారాయణ స్వామి బలపరీక్షకు ఒక రోజు ముందు అక్కడి రాజకీయాల పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటమికి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణతో పాటు డీఎంకె ఎమ్మెల్యే తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించి సీఎం నారాయణ స్వామికి గట్టి షాక్ ఇచ్చారు.
ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో నారాయణ స్వామి సర్కార్ మైనార్టీలో పడింది. సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ ఎదుర్కోవాల్సిన తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇరకాటంలో పడినట్లు అయ్యింది. పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు ఉండగా గతంలో కాంగ్రెస్, డిఎంకే, స్వతంత్ర అభ్యర్థి తో కూడిన కూటమి 18 మంది సభ్యుల బలంతో నారాయణ స్వామి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ఇటీవల మంత్రి సమశివాయం, ఎమ్మెల్యే తీపాయన్ దాస్ రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరారు. అనంతరం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మల్లాడి కృష్ణారావు, జాన్ కుమార్ రాజీనామా చేశారు. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో అసెంబ్లీలో కూటమి బలం 12 కు చేరింది. మరో పక్క ఎన్నార్ కాంగ్రెస్ ఏడు, అన్నా డీఎంకే నాలుగు, బీజేపీ నామినేటెడ్ ఎమ్మెల్యేలు ముగ్గురుతో ప్రతిపక్ష కూటమి బలం 14గా ఉంది. ప్రస్తుతం సభలో సభ్యుల సంఖ్య 26కు చేరింది. రేపు సాయంత్రం అయిదు గంటలకు సీఎం నారాయణ స్వామి బలపరీక్ష ఎదుర్కొనున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బలపరీక్షకు ముందే నారాయణ స్వామి సీఎం పదవికి రాజీనామా చేయవచ్చనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.