నరసాపురం పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజు సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. వైసీపీ ఏకంగా ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేసింది.
ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైతం రఘురామ రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనూ ఆయన తన దూకుడు తగ్గించుకోవడం లేదు. తాజాగా ఇంగ్లీష్ మీడియంపై ప్రభుత్వ అభ్యర్థనను…సుప్రీంకోర్టు తిరస్కరించడంపై కూడా స్పందించారు. ఇది ప్రజా విజయమని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు
సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా మాతృభాషలోనే విద్యాభ్యాసం చేస్తారని అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లొద్దని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోని అగ్రదేశాలు మాతృభాషనే బోధిస్తున్నాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. `అత్యంత పటిష్టమై ఆర్థిక వ్యవస్థల్లను కలిగి ఉన్న జర్మనీ, జపాన్ తదితర యూరప్ దేశాలు వారి స్వంత భాషలోనే బోధన కొనసాగిస్తున్నాయి. ఇంగ్లిష్ మీడియంతోనే ఉద్యోగాలు అనేది ఒక పిచ్చి ఆలోచన, ప్రతి ఒక్కరికి ఛాయిస్ ఉండాలి. రేపు మన విద్యావిధానమే మాతృభాషలోకి మారిపోతుందని గుర్తుపెట్టుకోండి` అంటూ రఘురామరాజు హెచ్చరించారు.
మళ్లీ అవే మాటలు
రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలపైనే కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని, కరోనా కట్టడిపై ప్రభుత్వం దృష్టి పెడితే ప్రజలకు మేలు జరుగుతుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీపై దృష్టిపెడితే పరిస్థితి మరో రకంగా ఉండేదని రఘురామ అన్నారు. నూతన ఆరోగ్య బీమా పాలసీతో ప్రభుత్వం ముందుకురావాలన్నారు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, అభివృద్ధి లేని సంక్షేమం భవిష్యత్కి చేటు చేస్తుందన్నారు. కోర్టులకు వెళ్లకుండా రాజధానిగా అమరావతినే ఉంచాలని రఘురామ కృష్ణంరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సూచించారు.
జగన్పై విమర్శలు… వైఎస్పై ప్రశంసలు
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సంధర్భంగా ఆయన అభిమానులు, వైసీపీ నేతలు నివాళులు అర్పించగా అదే రీతిలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వైఎస్ఆర్ నిలువెత్తు చిత్రపటానికి రఘురామ గులాబీ రేఖులతో పుష్పాభిషేకం చేసారు. ఈ ఫోటోను రఘురామ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసారు. “డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి నా నివాళులు… జోహార్ వైఎస్సార్” అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.