దర్శక ధీరుడు రాజమౌళి.. ఆయన కుటుంబ సభ్యులు రీసెంట్ గా కరోనాను జయించిన విషయం తెల్సిందే. హోం క్వారంటైన్ లో ఉన్నప్పుడే రాజమౌళి తన కుటుంబ సభ్యుల తో సహ కరోనా నుంచి కోలుకున్నాక ప్లాస్మా దానం చేస్తామని తెలిపారు. అన్నట్టుగానే ప్రస్తుతం ప్లాస్మా దానం చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలిపారు. ప్లాస్మా దానం గురించి సీపీ సజ్జనార్ చేస్తున్న పోరాటం నిజంగా అభినందనీయం అన్నారు. ఇది పోలీసుల డ్యూటీలో భాగం కాకపోయినప్పటికి ఇందుకోసం ఒక వేదిక ఏర్పాటు చేసి వాలంటీర్లను ఆహ్వానించి ప్లాస్మా డొనేషన్ ను ప్రోత్సహిస్తుండటం గొప్ప విషయమని చెప్పుకొచ్చారు. ఒక్కరు ఇద్దరితో ప్రారంభమైన ఈ మంచి ఈ కార్యక్రమం ఇప్పుడు రోజుకు దాదాపు 80 మంది వరకు ప్లాస్మా దానం చేయడం ఎంతో గొప్ప విషయమని అన్నారు.
ప్లాస్మా దానం చేసే వాళ్ళకి ఎలాంటి అనుమానాలు పడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా వెల్లడించారు రాజమౌళి. కరోనాతో బాధపడుతున్న వారికి ప్లాస్మా అనేది బ్రహ్మాస్త్రంగా పని చేస్తుంది. అందుకే ప్లాస్మాను దానం చేయడం వల్ల ఒకరి ప్రాణాలు కాపాడిన వారు అవుతారు. ప్లాస్మా దానం చేసిన వారు నిజమైన హీరోలు అన్నారు. అంతేకాదు మేము ప్రతి రోజు వెండి తెరపై ఎంతో మంది హీరోలను చూస్తాం. కాని రియల్ హీరోలు అంటే మీరే అని తెలిపారు. మీరందరూ యోధులు.. అంటూ ప్లాస్మా డోనర్స్ ను రాజమౌళి అభినందించారు.
ఇక త్వరలో నేను కూడా ప్లాస్మా దానం చేసి ఒక యోధుడిగా మారాలని ఎదురు చూస్తున్నాను. నాతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా ప్లాస్మా దానం చేయబోతున్నారని తెలిపారు. ప్లాస్మా తీసినప్పటికీ ఏమీ కాదని… మళ్లీ కొత్త ప్లాస్మా వస్తుందని వెల్లడించారు. ఇక ప్లాస్మా ఇచ్చేందుకు వెళ్లిన చోట ఎలాంటి పరిస్థితులు ఉంటాయో. అక్కడకు వెళ్తే మళ్లీ కరోనా బారిన పడాల్సి వస్తుందేమో అని భయపడుతున్న వాళ్ళు ఉన్నారు. చాలా జాగ్రత్తలు తీసుకుని వారు మీ నుండి ప్లాస్మా తీసుకుంటారు. కాబట్టి ఎటువంటి అనుమానాలు, భయాలు అవసరం లేదని .. తల్లిదండ్రులు ఎవరు కూడా ప్లాస్మా దానం చేస్తామంటే వద్దని.. వ్యతిరేకించకండి అని చెప్పారు.
ఇక రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కిస్తున్నారు. భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. డివీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.