టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు (83) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఈ తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతి చెందిన విషయం తెలియడంతో ఆయన సోదరుడి కుమారుడు ప్రముఖ హీరో ప్రభాస్ తో ఇతర బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. మరి కొద్ది సేపటిలో కృష్ణంరాజు భౌతికకాయాన్ని జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసానికి తీసుకువెళ్లనున్నారు.
1940 జనవరి 20న పశ్చమ గోదావరి జిల్లా మొగల్తూరు లో జన్మించిన ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు 1966లో చిలకా గోరింక సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 187 చిత్రాల్లో కృష్ణంరాజు నటించారు. చివరిసారిగా రాథేశ్యామ్ లో నటించారు. ఈ సినిమాలో పరమహంస పాత్రలో నటించారు. ఆయనకు భార్య శ్యామలాదేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కృష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణరాజు కుమారుడు ప్రముఖ హీరో ప్రభాస్. సినీ రంగంలోకి వెళ్లకముందు హైదరాబాద్ లో కొంత కాలం ఓ పత్రికలో జర్నలిస్ట్ గా పని చేశారు.
సినీ రంగం నుండి బీజేపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన కృష్ణంరాజు 1998 లో కాకినాడ లోక్ సభ స్థానం నుండి పార్లమెంట్ సభ్యుడుగా గెలిచారు. ఆ తరువాత 1999 ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానం నుండి పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికయ్యారు. అటల్ బిహారీ వాజ్ పేయి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2009 ఎన్నికలకు ముందు బీజేపీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరిన కృష్ణంరాజు ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. కృష్ణంరాజు మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి ప్రముఖులు సంతాపాలు తెలియజేస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!