RRR Pay Per View: ప్రస్తుత ప్రతికూల పరిస్థితులలో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్ర బృందాలు సినిమాలు రిలీజ్ చేయాలా వద్దా అనే విషయంలో ఏ నిర్ణయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ను జనవరి 7న, రాధేశ్యామ్ను జనవరి 14న రిలీజ్ చేయాలని ఆయా సినీ యూనిట్లు నిర్ణయించాయి. 15 రోజుల్లోనే ఈ రెండు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. దీనితో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించగా.. సినిమా హాల్స్ రాత్రి కాగానే మూతపడుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడంలేదు. ఢిల్లీలో కేసుల సంఖ్య మరింత ఆందోళనకర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాంతో ఢిల్లీ ప్రభుత్వం త్వరలోనే ఎల్లో అలర్ట్ ప్రకటించి సినిమా హాల్స్ ని పూర్తిగా మూసి వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాల విడుదల నాటికి ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరిగితే రాష్ట్రాలు 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరిచేలా ఆదేశాలు జారీ చేయొచ్చు లేదా వాటిని పూర్తిగా మూసేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.
RRR: కనీస కలెక్షన్లు రాకపోవచ్చు
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పటికే సినిమా టికెట్ల ఇష్యూ సినిమా హాళ్లకు, దర్శకనిర్మాతలు, నటీనటులకు కొరకరాని కొయ్యగా మారింది. కొత్త నియమ నిబంధనలకు అనుగుణంగా లేని సినిమా హాళ్లను ప్రభుత్వ యంత్రాంగాలు సీజ్ చేస్తున్నాయి. దీనివల్ల ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి పెద్ద సినిమాలు బాగా నష్టపోయే అవకాశం ఉంది. సినీ విశ్లేషకుల ప్రకారం, ఆర్ఆర్ఆర్ కనీసం రూ.300 కోట్లు, రాధేశ్యామ్ తక్కువలో తక్కువ రూ.150 కోట్లు సంపాదిస్తేనే నష్టాల నుంచి బయట పడవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఈ రేంజ్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రావడం గగనమే!
ఆర్ఆర్ఆర్కు ఓటీటీయే దిక్కు
సమీప భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులన్నిటినీ జాగ్రత్తగా అంచనా వేసుకొని తమ సినిమా కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం పడుతుందో భారీ బడ్జెట్ సినిమాల దర్శకనిర్మాతలు సమాలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఒకటే ఒక ఆప్షన్ చాలా ఉత్తమంగా కనిపిస్తోంది. అది ఏంటంటే పే-పర్-వ్యూ పద్ధతిలో ఓటీటీ ద్వారా నేరుగా రిలీజ్ చేయడం. ఒక టికెట్కు రూ.500 లేదా అంతకన్నా ఎక్కువ ధర పెట్టినా ప్రేక్షకులకు అంతగా భారం అనిపించిందేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఒక్క టిక్కెట్ తో ఇంటిల్లపాది సినిమాని వీక్షించవచ్చు. దీనివల్ల ఎక్కువ మందికి నష్టం కూడా ఉండదు.
ఓటీటీ రిలీజ్ పై చర్చ
ఏపీ థియేటర్లలో ప్రస్తుత టిక్కెట్ల ధరలు 20 రూపాయలకు తగ్గిపోయాయి. మిగతా రాష్ట్రాల్లో థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడిచే అవకాశం ఉంది. రాబోయే 15 రోజుల్లో కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా థియేటర్లు మూత పడే అవకాశం లేకపోలేదు. ఈ అంశాలన్నీ మూవీ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపొచ్చు. అందువల్ల సల్మాన్ ఖాన్ తన రాధే సినిమాను రిలీజ్ చేసినట్టుగా రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ను ఓటీటీలో పే-పర్-వ్యూ పద్ధతిలో రిలీజ్ చేయడానికి చర్చలు జరుపుతున్నట్టు సినీ వర్గాల్లో ఒక టాక్ నడుస్తోంది. త్వరలోనే ఆర్ఆర్ఆర్ను ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు రాజమౌళి ప్రకటించొచ్చని కూడా విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో ఏ రిస్కు లేకుండా ఇంట్లోనే సినిమా చూసే వెసులుబాటు కల్పిస్తే ప్రేక్షకులు కూడా సంతోషపడతారని ఆర్ఆర్ఆర్ బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఓటీటీ ద్వారానే మంచి కలెక్షన్లను రాబట్టవచ్చని విశ్వసిస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!