కర్నూలు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న నాలుగు కోట్లకు పైగా విలువ చేసే వెండిని పోలీసులు సీజ్ చేశారు. నలుగురు వ్యక్తులను, ఒక మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప కాగినెల్లి తెలిపిన సమాచారం ప్రకారం… పెద్ద ఎత్తున వెండి అక్రమ రవాణా జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంపై అమకతాడు టోల్ ప్లాజా వద్ద గురువారం రాత్రి వాహనాలు తనిఖీ నిర్వహించామన్నారు.
డోన్ రూరల్ సిఐ మహేశ్వర్ రెడ్డి, క్రిష్ణగిరి, వెల్దుర్తి, డోన్ రూరల్ ఎస్ఐ లు రామాంజనేయరెడ్డి, పెద్ద నాయుడు, మధుసూదన్ పోలీస్ సిబ్బంది తో వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా హైదరాబాద్ నుండి బెంగళూరు వైపు వెళుతున్న కారులో 18 చిన్న సంచుల్లో వెండి బిస్కెట్లు ఉండటాన్ని గుర్తించారని తెలిపారు. మొత్తం 686.5 కిలోల వెండి ఉన్నట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వెండి నాలుగు కోట్ల 35 లక్షల విలువ ఉంటుందని చెప్పారు.
కారులో ఉన్న తమిళనాడుకు చెందిన జె ప్రకాష్ జయరామ్, భాస్కర్, కత్రీవెల్, సతీష్, మరో మైనర్ బాలుడు లను అదుపులోకి తీసుకొని విచారించగా చత్తీస్ఘడ్ రాష్ట్రం రాయిపూర్ నుండి తమిళనాడు రాష్ట్రం సేలంకు ఈ వెండిని తరలిస్తున్నట్లు తెలిసిందన్నారు. వారి వద్ద వీటికి సంబంధించి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్టు తెలిపారు. దీనిపై క్రిష్ణగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఈ అక్రమ రవాణాను చాకచక్యంగా చేధించిన పోలీసు అధికారులు సిబ్బందిని డీజీపీ గౌతమ్ సవాంగ్, ఎస్పీ ఫక్కిరప్ప కాగినెల్లి అభినందించారు.