తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కొద్దిమందికి ఒకరకమైన న్యాయం.. మిగిలిన అందరికీ ఇంకోరకమైన న్యాయం ఉంటుందా అనే విషయంలో ప్రజలు ఆలోచించాలని అన్నారు. న్యాయం విషయంలో కొందరిని రక్షించాలనే అంశం అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు వద్దకే వెళుతుండటం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు.
తీర్పుపై సంచలన వ్యాఖ్యలు
న్యాయవాద వృత్తిలో ఉన్న ఓ వ్యక్తి అమరావతి ల్యాండ్ స్కాం విచారణలో భాగంగా ఆయన కూడా అమరావతిలో భూములు కొన్నారని ప్రాథమిక సమాచారం ఉందంటూ.. ఆయనతో పాటు 12 మందిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని సజ్జల తెలిపారు. దీంతో దేశంలో ఉన్న అత్యంత ఇన్ ఫ్లూయన్స్(పలుకుబడి) ఉన్నశక్తులన్నీ ఒక్కసారిగా ఏకమయ్యాయని వ్యాఖ్యానించారు. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఆ శక్తులన్నీ కదిలాయో అర్థం కావటం లేదు. ఇది ఎవరి వ్యక్తిగత ప్రతిష్టకో భంగం కలిగించే అంశం కాదు. ఎవరి వ్యక్తిత్వాన్ని హననం చేసే పరిస్థితి లేదు. అప్పటికప్పుడు శిక్షలు పడే పరిస్థితీ ఉండదు. కేవలం నమోదు అయింది ఎఫ్ఐఆర్ మాత్రమే అయినప్పుడు ప్రస్తుత పరిణామాలు చర్చకు దారితీస్తున్నాయని సజ్జల అన్నారు.
ఇప్పుడే ఎందుకు ఇలా జరిగింది?
అమరావతి రాజధాని ప్రాంతంలో ల్యాండ్ డీల్స్ కు సంబంధించి.. నిర్దేశిత సమయంలో అప్పట్లో పలుకుబడి కలిగిన వ్యక్తులు కొందరు అక్కడ భూములు కొన్నారని ఆధారాలతో ఏసీబీ కేసు నమోదు చేసిందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. “ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది ఇండిపెండెంట్ సంస్థ. దానికి ఆధారం చట్టం ద్వారా ఏర్పడిన సిట్. ఆ చట్టం అంటే జీవో తెచ్చింది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. అమరావతి ల్యాండ్ స్కాంకు సంబంధించి ఆ సంస్థల విచారణల్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు.. దీనివల్ల ఏ ఒక్కరి ప్రతిష్టకు భంగం లేదు.“ అని సజ్జల పేర్కొన్నారు.
తప్పు చేశారు… ఆ హక్కు ఉంది
2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. అమరావతి రాజధాని అంశంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది అని సజ్జల పునరుద్ఘాటించారు. “ల్యాండ్ పూలింగ్ పేరుతో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఈ విషయాన్ని మేము చెబుతూనే వస్తున్నాం. 2019 ఎన్నికల్లోనూ మేం ఆ విషయం చెప్పి ఎన్నికలకు వెళ్ళాం. మేం అధికారంలోకి వచ్చాక.. కచ్చితంగా అమరావతి రాజధాని భూముల మీద విచారణ జరిపిస్తాం అని చెప్పాం. దీనికి లాజికల్ ఎండ్ కు పుష్ చేస్తాం అని చెప్పాం. దానిమీదే ప్రజలు తీర్పు ఇచ్చారు. 151 సీట్లతో జగన్ ను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించారు. 51 శాతం ఓట్లతో ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు. ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా.. గత ప్రభుత్వం తప్పులు చేసి ఉంటే, ఆ తప్పులు మీద, వారు చేసిన అక్రమాల మీద విచారణ చేసే హక్కు ఉంటుంది. ఇది ఎవరూ కాదనలేరు. “