దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకర స్థితికి చేరుకుందనేది ఇప్పుడు అనేకమంది చెప్తున్న మాట. దేశీయ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో పతనమైంది.
కరోనా వైరస్ మహమ్మారి విలయంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 23.9 శాతం కుదేలైంది. కరోనా వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నదని, ఆ దేవుడే కాపాడగలడని నిర్మలా సీతారామన్ ఇటీవల మీడియా సమావేశంలో వ్యాఖ్యానించడం సంచలనం సృష్టిస్తోంది.
దారుణంగా లెక్కలు…
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) సోమవారం ప్రకటించిన అధికారిక గణాంకాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో (ఏప్రిల్, మే, జూన్ నెలల్లో) దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 23.9 శాతంగా ఉంది. కరోనా సంక్షోభంతో గత ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి త్రైమాసికంలో నమోదైన 5.2 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే రికార్డు స్థాయికి క్షీణించింది. అంతకుముందు త్రైమాసికం (2020 జనవరి, ఫిబ్రవరి, మార్చి)లో జీడీపీ 3.1 శాతం వృద్ధి నమోదైంది.1996లో భారతదేశం త్రైమాసిక గణాంకాలను ప్రచురించడం ప్రారంభించినప్పటి నుండి ఇదే అతి పెద్ద పతనం. తయారీ, నిర్మాణ, వాణిజ్య రంగాలు వరుసగా 39.3శాతం, 50.3 శాతం, 47 శాతం వద్ద భారీ క్షీణించాయని ఎన్ఎస్ఓ విడుదల చేసిన డేటా తెలిపింది. ప్రభుత్వ వ్యయం కూడా 10.3శాతం పడిపోయింది.
ఎక్కడ దెబ్బ పడిందంటే…
పారిశ్రామిక, సేవా రంగాలు ఇంకా కరోనా ప్రభావం నుంచి బయటపడలేదన్న ఇండియా రేటింగ్స్.. గాడి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి దారిలోకి తెచ్చేందుకు వ్యవసాయ రంగమే చోదక శక్తి అవుతుందన్నది. లాక్డౌన్తో పారిశ్రామిక కార్యకలాపాలు స్తంభించడం, దుకాణాలు, హోటల్స్, సినిమా హాల్స్ మూతపడటం వంటివి నగరవాసుల కొనుగోళ్ల శక్తిని తీవ్రంగా ప్రభావితం చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగాల్లేక, జీతాలు రాక, ఉపాధి కరువై అంతా ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు.
ఇదొక్కటే మనకు దిక్కు…
కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో తొలి త్రైమాసికంలో భారీగా క్షీణతను నమోదు చేసింది. దేశ ఆర్థిక పురోగతికి గ్రామీణ డిమాండ్ దన్నుగా నిలువగలదని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తాజా నివేదికలో పేర్కొన్నది. అయితే పట్టణ డిమాండ్కు ఇది ప్రత్యామ్నాయం మాత్రం కాలేదని స్పష్టం చేసింది. ఉద్యోగాల్లేక, జీతాలు రాక, ఉపాధి కరువై అంతా ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. దీంతో వ్యవసాయ ఆధారిత గ్రామీణ ప్రాంతాల్లోనే డిమాండ్ కనిపించింది. జూన్లో మోటర్సైకిల్, ట్రాక్టర్ల అమ్మకాల్లో నమోదైన వృద్ధిరేటే ఇందుకు నిదర్శనం. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటం కూడా వ్యవసాయంపై మరిన్ని ఆశల్ని రేకెత్తిస్తున్నాయి.
రాహుల్ సంచలన నిర్ణయం
దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వీడియో సిరీస్ ప్రారంభించారు. మొదటి వీడియోను సోమవారం నాడు ట్విట్టర్లో పంచుకున్నారు. “దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక విషాదం ఈ రోజు ధృవీకరించబడుతున్నది. భారత ఆర్థిక వ్యవస్థ 40 ఏండ్లలో తొలిసారిగా భారీ మాంద్యంలో ఉంది. అవమానం దేవుణ్ణి నిందిస్తోంది” అంటూ కామెంట్ పోస్ట్ చేశారు. వీడియో సిరీస్ లో భాగంగా 3.38 నిమిషాల నిడివిగల తొలి వీడియోలో రాహుల్ మాట్లాడుతూ.. డీమోనిటైజేషన్, తప్పుడు జీఎస్టీ విధానం, లాక్డౌన్ ఆర్థిక వ్యవస్థపై దాడికి మూడు పెద్ద ఉదాహరణలుగా గత 4 నెలల్లో 2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అసంఘటిత రంగంలో 40 కోట్ల మంది కార్మికులు సంక్షోభంలో చిక్కుకున్నారు’ అని చెప్పారు. “ప్రభుత్వాన్ని నడపడానికి ప్రధానమంత్రికి మీడియా అవసరం, మార్కెటింగ్ అవసరం. మీడియా-మార్కెటింగ్ 15-20 మంది చేస్తారు. అనధికారిక రంగంలో మిలియన్ల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ రంగాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా ప్రజల డబ్బు తీసుకోవాలనుకుంటున్నారు. ఫలితంగా హిందుస్తాన్ ఉపాధిని పొందలేక పోతోంది. ఎందుకంటే అనధికారిక రంగం 90 శాతం కంటే ఎక్కువ మందికి ఉపాధిని అందిస్తుంది” అని రాహుల్ గాంధీ మండిపడ్డారు.