తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ఓ వైపు దుబ్బాక ఎన్నికల్లో వచ్చిన సంచలన తీర్పు , మరోవైపు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో అందరి చూపు పడింది.
ఈ సమయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఊహించని రీతిలో వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా ఆయన చేసిన కామెంట్లు చర్చకు దారి తీశాయి. విపక్షాలు విరుచుకుపడే అవకాశం కల్పించాయి.
అసలేం జరిగింది ?
రాష్ట్ర సర్కారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని.. బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దుబ్బాక బైఎలక్షన్ సందర్బంగా తమ ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా బీజేపీ నేతల నుంచి తనకు ఫిర్యాదులు అందాయని.. రాష్ట్ర సర్కారు ఇలా చేయడం సరైనదేనా అని ప్రశ్నించారు. దీనిపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని, ట్యాపింగ్ నిజమని తేలితే కేంద్ర అధికారులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు
కాంగ్రెస్ పార్టీ పంచ్ అదిరిపోయిందిగా
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికారి ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రిగా రాజ్యాంబద్ధమైన పదవిలో ఉంటూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ గగ్గోలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన పోలీసులపై నేరుగా దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసే అధికారం ఉన్నా, కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని కామెంట్లు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ… రైట్ టు ప్రైవసీని ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోగల్గిన అధికారాలు, సాధికారత ఉన్న రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి కూడా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. సామాన్యులవలె ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానంటే, మరి సామాన్యుడి పరిస్థితి ఏంటని దాసోజు ప్రశ్నించారు. హోం శాఖనే స్వయంగా దర్యాప్తునకు ఎందుకు ఆదేశాలు జారీ చేయడం లేదని ఆయన నిలదీశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నేతల ఫోన్లను ట్యాప్ చేయడం ఎప్పటి నుంచో జరుగుతోందని అన్నారు.
ఎర్రన్నలు సైతం కామెంట్ చేసేశారండోయ్
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సైతం ఆసక్తికర కామెంట్లు చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారి నోట రాష్ట్ర ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని ప్రకటించడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని ఎద్దేవా చేశారు. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పరిస్థితి కి దిగజారితే రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవడానికి కేంద్రానికి అధికారం లేదా అని సీపీఐ ప్రశ్నిస్తుందని కామెంట్ చేశారు. ఏ ఒక్క వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు చేపట్టే విశేష అధికారాలు సమాచార శాఖకు ఉంటాయని భావించాలని చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.