తెలంగాణలో ఊహించని ఆందోళన తెరమీదకు వస్తోందా? ఏకచత్రాధిపత్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్కు సొంత పార్టీ నేతలే షాకివ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా ఉండే ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీలు ఆందోళన బాట పట్టడం, అందులో టీఆర్ఎస్ నేతలు కూడా ఉండటం చర్చకు తెరలేపింది.
వాళ్ల ఆందోళన ఎంటంటే…
క్షేత్రస్థాయిలో క్రియాశీలంగా ప్రజాప్రతినిధుల్లో ఒకరైన ఎంపీటీసీలు తమ విధులు, బాధ్యతల పట్ల కొద్దికాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ నిధులు, విధులు, అధికారాలను స్థానిక సంస్థలకు బదలాయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. అయితే, ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఆందోళన బాట పట్టారు.టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేకేను తెలంగాణ ఎంపీటీసీ సంఘం నాయకులు కలిసి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాల్సిందిగా కేకేను తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ఎంపీటీసీలు కోరారు.
వైఎస్ జమానాలో ఏం జరిగిందంటే…
2007లో పీసీసీ చీఫ్ హోదాలో అప్పటి సీఎం వైఎస్ఆర్ తో మాట్లాడి ఎంపీటీసీల సమస్యలను పరిష్కరించటంలో కేకే కీలకంగా వ్యవహరించారని ఎంపీటీసీలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్గా ఉన్న కేకేను తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వెళ్ళాలని ఎంపీటీసీల సంఘం నేతలు పేర్కొన్నారు.
అప్పుడే నిరాశ పరిచేశారు
టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కేకేను తెలంగాణ ఎంపీటీసీల సంఘం నాయకులు కలిసి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని కోరగా వారికి నిరాశ ఎదురైంది. ఎంపీటీసీల అంశం తన పరిధిలోనిది కాదన్న కేకే పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలవాలని కోరారు. దీంతో ఎంపీటీసీలు నిరాశతో వెనుదిరిగారు.
టీఆర్ఎస్ నేతల సంచలన నిర్ణయం?
కేకేతో సమావేశం అనంతరం ఎంపీటీసీల సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ మూక్కుమ్మడి రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. నిధులు ఇవ్వకుంటే.. ఎంపీటీసీ వ్యవస్థనే రద్దు చేయండి అంటూ ప్రభుత్వానికి సంచలన ప్రతిపాదన చేశారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలోని ఎంపీటీసీలు అందరదీ ఒకే మాట అని వారు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎంపీటీసీలకు సైతం ప్రభుత్వం నిధులు ఇవ్వటం లేదని ఎంపీటీసీల సంఘం నాయకులు వాపోయారు. ఓట్లు వేసిన ప్రజలకు సమాధానం చెప్పలేక గ్రామాల్లో తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డు మెంబర్లకు ఇచ్చే గౌరవం కూడా తమకు దక్కటం లేదని పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం మరోసారి మంత్రి ఎర్రబెల్లిని కలుస్తామని ప్రకటించారు. మంత్రి తమ సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళాలని కోరారు. ఎంపీటీసీల అంశం తన పరిధిలోనిది కాదని కేకే చెప్పినందున సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దగ్గర తాడోపేడో తేల్చుకుంటామని ప్రకటించారు. ఏకంగా టీఆర్ఎస్ నేతల భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ ఆందోళన తిరుగుబాటు అనుకోవాలా లేకపోతే టీ కప్పులో తుఫానులాగా ముగిసిపోయే ఆందోళన అనుకోవాలా అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.