న్యాయదేవతపై నిఘా పేరుతో ఓ పత్రికలో వచ్చిన కథనం అనంతరం ఈ వార్తపై ఓ న్యాయవాది కోర్టు మెట్లెక్కడం తెలిసిన సంగతే. అయితే, ఈ ఎపిసోడ్ జాతీయ మీడియా దృష్టికి చేరేలా పరిస్థితులు మారుతున్నాయి. ఏపీ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలే ఇందుకు నిదర్శనం.
సంచలన ఆరోపణలు…
న్యాయదేవతపై నిఘాపేరుతో ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా విచారణ జరిపించాలని, పేర్కొంటూ న్యాయవాది శ్రవణ్ కుమార్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఫోన్ ట్యాపింగ్ కోసం ఏపీ సర్కార్ ప్రత్యేకంగా అధికారిని నియమించిందని పిటిషన్లో ఆరోపించారు. న్యాయమూర్తులకు కూడా షాడో పార్టీలను నియమించి ట్యాపింగ్ చేస్తున్నారని శ్రవణ్ సంచలన అంశాలను తన పిటిషన్లో ప్రస్తావించారు. ప్రభుత్వం తరపు న్యాయవాది దీనికి తగు వివరణ ఇచ్చారు.
హైకోర్టు కీలక ఆదేశాలు….
ఈ సందర్భంగా ఆధారాలు ఉంటే జతచేసి అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి ఆదేశించింది. దర్యాప్తు ఎందుకు జరపకూడదని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో కౌంటర్ దాఖలు చేయాలని సర్వీస్ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అలాగే గురువారం లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది.
రఘురామ కృష్ణంరాజు వచ్చేశారు….
మరోవైపు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని వార్తలు దురదృష్టకరమని పేర్కొన్నారు. ఫోన్లు ట్యాప్ చేయడం వల్ల ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందని పేర్కొన్న ఆయన ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారాన్ని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సుమోటోగా తీసుకొని విచారణకు ఆదేశించకముందే.. రాష్ట్ర ప్రభుత్వమే విచారణకు ఆదేశించాలని రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్కు తెలిసి జరగకపోయినా.. ఆయన అభిమానం సంపాదించడానికి కొంతమంది అధికారులు ఇలా చేస్తున్నారని ఆరోపించిన రఘురామ కృష్ణంరాజు.. తెలియకుండా మీ కోటరిలోని అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతున్నారు… కోర్టులు శిక్షించకముందే ప్రభుత్వమే విచారణ జరిపి శిక్షించాలని అని సూచించారు. తమ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే జరగబోతోందా?….
కాగా, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వివాదం దుమారం రేపుతోంది. ఈ అంశంపై హైకోర్టు విచారణ ఈనెల 20కి వాయిదా వేసినప్పటికీ ఓ వైపు సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఇవ్వడం మరోవైపు ఢిల్లీ వేదికగా సాక్షాత్తు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన ఫోన్ను తమ ప్రభుత్వమే ట్యాపింగ్ చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ విషయం జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి.