తాజాగా ఫలితాలు వెలువడిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అత్యంత దారుణంగా అవమానం పాలైన ప్రధాన పార్టీలు తెలుగుదేశం పార్టీ , కాంగ్రెస్ పార్టీ అనే మాట విశ్లేషకుల నుంచి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, చిత్రంగా ఇరు పార్టీలు ఈ అవమానంపై సమీక్షించడం పక్కన పెట్టేశాయి.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలైతే అవమానం గురించి కంటే అవకాశాల గురించి ఆసక్తిగా ప్రయత్నిస్తున్నారట. తెలంగాణ పీపీసీ అధ్యక్షపదవికి ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో.. పీసీసీ చీఫ్ పోస్ట్ ఆశిస్తున్నవారంతా రేస్లోకి వచ్చారు.. నేనే ట్రై చేస్తున్నానంటే.. నేను రేసులో ఉన్నానని నేతలు ప్రకటిస్తున్నారు. ఈ పరిణామం పట్ల ఆశ్చర్యపోవడం క్యాడర్ వంతు అవుతోంది.
ఉత్తమ్ రాజీనామాతో…
ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది. ఇందుకోసం అధిష్టానం పార్టీలో అభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఇందులో భాగంగా ఈనెల 9న రాష్ట్రానికి ఏఐసీసీ బృందం రానుంది. ఈ బృందం రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అభిప్రాయాలను సేకరించనుంది. పీసీసీ ఎంపిక తర్వాత పార్టీలో లుకలుకలు లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకోసమే అభిప్రాయ సేకరణ ద్వారా పీసీసీ చీఫ్ ఎంపిక చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వీళ్లంతా లిస్టులో…
పీసీసీ చీఫ్ పదవి కోసం పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యేలు డి.శ్రీధర్బాబు, జగ్గారెడ్డి కూడా ఉన్నారు. తనను కెప్టెన్ చేయాలంటూ ఇప్పటికే కోమటిరెడ్డి ఏఐసీసీ నేతలను కోరారు. రేవంత్రెడ్డి కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఏఐసీసీ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారు. అయితే, సామాజిక సమీకరణాల ప్రకారం ఆలోచించాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏఐసీసీకి విన్నవించడంతో.. శ్రీధర్బాబు, భట్టి సహా మరికొందరి పేర్లు చర్చకు వచ్చాయని సమాచారం. ఇదే సమయంలో బీసీ నేతలు సైతం తమకు చాన్సివ్వాలని కోరుతున్నారు.
జగ్గారెడ్డి ఏమంటున్నారంటే…
మొదటి నుంచి పీసీసీ పీఠంపై కన్నేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. నేను పీసీసీ కోసం సీరియస్గా ట్రై చేస్తున్నానని ప్రకటించారు.. పీసీసీ అవ్వాలంటే డబ్బులు అవసరం లేదన్న జగ్గారెడ్డి… ఎన్నికల్లో ఓడిపోతే ఉత్తమ్కు అంటగట్టే వారు.. గెలిస్తే ఎందుకు ఆయనకు క్రెడిట్ ఇవ్వరు? అని ప్రశ్నించారు. తనకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్ను కోరుతానని చెప్పారు.