(హైదరాబాద్ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఢిల్లీ వాసులు మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున పటాన్చెరువు మండలం పాటి ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగింది. బొలేరో వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
సిఐ రామిరెడ్డి తెలిపిన సమాచారం ప్రకారం..ఢిల్లీకి చెందిన కొందరు బొలెరో వాహనంలో హైదరాబాద్ నుండి పటాన్చెరువు వైపు వెళుతుండగా ఔటర్ రింగ్ రోడ్డుపై పాటి సమీపంలో వెనుక నుండి వస్తున్న ఒ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదం కారణంగా బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఆ వాహనంలో ఉన్న ఆరుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.