Sonu sood; కరోనా సెకండ్ వేవ్ వేగంగా పలు రాష్ట్రాల్లో వేగం విస్తరిస్తున్నారు. దేశంలో లక్షా 30వేల కుపైగా కేసులు నమోదు అవుతుండగా అందులో సగం మహారాష్ట్ర నుండే ఉంటున్నాయి. మరో పక్క పంజాబ్ రాష్ట్రంలోనూ రోజుకు 3వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నారు. 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా 50 మంది మృత్యువాత పడ్డారు. కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం దేశంలో కోవిషీల్డ్, కోవాక్సిన్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి అపోహలు పడాల్సిన అవసరం లేదని విస్తృతంగా ప్రచారం చేస్తున్నా ప్రజల్లో అవగాహన లోపం కారణంగా ఎక్కువ సంఖ్యలో ముందుకు రావడం లేదు.
వ్యాక్సినేషన్ లక్ష్యాలను అధిగమించేందుకు పంజాబ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా కష్టకాలంలో తన సేవా కార్యక్రమాల ద్వారా అపర దానకర్ణుడిగా, రియల్ హీరో గా దేశ వ్యాప్తంగా సినీ నటుడు సోనూ సూద్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనూ సూద్ ను పంజాబ్ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.
ఈ విషయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వెల్లడిస్తూ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా జరిగేందుకు సోనూసూద్ మద్దతు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్క పంజాబీని రక్షించుకోవడమే తమ కర్తవ్యమని పేర్కొన్నారు సీఎం అమరీందర్ సింగ్. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు.