తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై విచారణ సిబిఐ విచారణ కోరాలని జగన్ మంత్రి మండలి నిర్ణయించింది.ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలుత దృష్టి సారించింది గత ప్రభుత్వ అక్రమాలపైనే అన్నది అందరికీ తెలిసిందే. ఎలాగైనా టీడీపీ అధినేత చంద్రబాబును బుక్ చేయాలనే లక్ష్యంతోనే ఆయన ముందుకు కదలారనే కథనాలు వచ్చాయి.
ఇందుకోసం గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న పలు నిర్ణయాలను సమీక్షించారు. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.ఈ నేపథ్యంలో గురువారం జరిగిన కేబినెట్ భేటీలో మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికను సమర్పించింది. ప్రధానంగా ఏపీ ఫైబర్ నెట్ లో భారీ కుంభకోణం జరిగిందని పేర్కొంది. అర్హత లేని సంస్థలకు టెండర్లు కట్టబెట్టడంతోపాటు సెట్ టాప్ బాక్సుల కొనుగోలులో దాదాపు రూ.700 కోట్ల అక్రమాలు జరిగాయని తేల్చింది. అలాగే రంజాన్ తోఫా, చంద్రన్న కానుక పథకాల్లో రూ.158 కోట్ల మేర అవకతవకలు జరిగాయని పేర్కొంది. అలాగే హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల కోసం ఏడాదికి రూ.40 కోట్లు వెచ్చించారని, ఇందులోనూ అక్రమాలు ఉన్నాయని నివేదికలో ప్రస్తావించారు.
దీనిపై చర్చించిన కేబినెట్.. వీటిపై సీబీఐ విచారణ కోరాలని నిర్ణయం తీసుకుంది. టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని గతంతో వైసీపీ పలుమార్లు ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే బాబు హయాంలో అక్రమాలపై దృష్టి పెట్టి.. తవ్వకాలు జరిపారు. కానీ ఏడాది తర్వాత వచ్చిన నివేదికలో రూ.900 కోట్ల మేర మాత్రమే అవకతవకలు జరిగాయని మంత్రివర్గ ఉప సంఘం పేర్కొనడం విశేషం.దీంతో జగన్ ప్రభుత్వం కొండను తవ్వి ఎలకను పట్టినట్టు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి..!