Attack On Doctors: వైద్యులపై దాడులకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా కేంద్రం శనివారం నాడు రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.2020 ఎపడిమిక్ డిసీజెస్ సవరణ చట్టం కింద అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కేంద్రం ఆయా ప్రభుత్వాలకు సూచించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈ మేరకు ఒక అత్యవసర లేఖను రాశారు.కరోనా సంక్షోభ సమయంలో అనేక చోట్ల వైద్యులు, వైద్యరంగ సిబ్బంది పై దాడులకు దిగడం పరిపాటిగా మారిన నేపథ్యంలో కేంద్రం స్పందించింది.ఇప్పటికే వైద్యులపై దాడులను ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహించింది.దీంతో కేంద్రం ఈ అంశంపై ఫోకస్ పెట్టింది.ఇందులో భాగంగానే రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హోంశాఖ కార్యదర్శి లేఖ రాశారు.
Attack On Doctors: అస్సాంలో దారుణం!
అస్సాంలోని ఒక కోవిడ్ కేర్ సెంటర్ లో ఈ నెల మూడువ తేదీన చికిత్స పొందుతూ ఒక కరోనా రోగి మరణించగా అతని బంధువులు విధ్వంసానికి పాల్పడ్డారు.ఆ చికిత్సా కేంద్రం ఇన్చార్జి డాక్టర్ ,నర్సులపై వారు దాడిచేసి విచక్షణారహితంగా కొట్టడంతో వారు ఐసీయూలో చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ కేసులో ఇప్పటికే ఇరవై అయిదు మందిని అరెస్టు చేయడం జరిగింది.ఇదనే కాదు ఇంకా అక్కడక్కడా కూడా ఇలాంటి సంఘటనలు జరగడంతో ఐఎంఏ ఉద్యమించింది.దీంతో కేంద్రం కూడా వైద్యులకు అండగా నిలిచింది.
వైద్యులపై దాడి చేస్తే ఇకపై జరిగేదేమిటి?
కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ర్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం ఇకపై వైద్యులపై ఎవరైనా దాడి చేస్తే నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసులు నమోదవుతాయి.అంతేగాకుండా 2020 ఎపడిమిక్ డిసీజెస్ సవరణ చట్టం కింద అలాంటి వారికి కనీసం ఏడేళ్ల జైలుశిక్ష ,5లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశం కూడా ఉంది.ఈ విషయాలన్నింటినీ కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిన సర్క్యులర్ లో వివరించారు.”వైద్యులను, వైద్య సిబ్బందిని కాపాడుకోవటం అందరి బాధ్యత కావాలి.వారి సేవలు దేశానికి ఎంతైనా అవసరం.ఇకపై ఎవరైనా వారి మీద దాడికి పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించండి “అని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆ సర్కులర్ లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.