వైద్యో నారాయణ హరి అని చిన్నప్పుడు వినే వారం! అంటే వైద్యుడు దేవుడితో సమానమని అర్థం! ప్రస్తుత వైద్యుల పోకడలను చూసిన తర్వాత వారిపై ఎవరికీ ఇలాంటి భావన కలగదు.
రోగులను పీల్చి పిప్పి చేసే వారుగానే వారిని ప్రజలు పరిగణిస్తుంటారు.ఇక ప్రభుత్వ వైద్యులపై ప్రజలకు మరీ చెడు అభిప్రాయం ఉంది.ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లడం కంటే రోగంతో కుళ్లి చనిపోవటం మేలని భావించే వారు కూడా లేకపోలేదు.ప్రభుత్వ వైద్యులు రోగులను పట్టించుకోరని ట్రీట్మెంట్ సరిగ్గా ఉండదని సర్వత్రా ఒక దురభిప్రాయం నెలకొనివుంది.కానీ ఒకే ఒక్క ప్రభుత్వ వైద్యుడు …ప్రజల మైండ్ సెట్ ను మార్చేశాడు.వైద్యులపై గౌరవం పెంచేశాడు.ప్రభుత్వ ఆసుపత్రి పరువు నిలిపాడు.తద్వారా ప్రభుత్వ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేశాడు.
అతడే ఒంగోలు రిమ్స్ ప్రభుత్వ ఆస్పత్రిలోని కోవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ జాన్ రిచర్డ్స్. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఈ యువ డాక్టర్ కరోనా వల్ల అలుముకున్న చీకటిలో కాంతి పుంజమై నిలిచాడు. వందలాదిమంది కరోనా రోగుల ప్రాణాలు నిలిపాడు. ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి వెళ్ళడానికి కరోనా రోగులు ఈరోజు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదంటే అందుకు కారణం అక్కడ జాన్ రిచర్డ్స్ ఉండడమే. కరోనా డ్యూటీ పడినప్పటి నుంచి ఈ డాక్టర్ రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు. సహాయకుల కొరతను కూడా అధిగమించి తానే సవ్యసాచిలా జాన్ రిచర్డ్స్ కరోనా రోగుల సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు.
నిద్రాహారాలు మాని ఈ డాక్టర్ డ్యూటీ చేస్తున్న తీరు ఇతర ప్రభుత్వ వైద్యులకు కూడా ఆదర్శప్రాయం.రిమ్స్ ఆసుపత్రిలో ఇతర రకాల సదుపాయాలు లేకపోవచ్చు. అనేక లోటుపాట్లు ఉండొచ్చు. అవన్నీ విమర్శలకు గురిఅవుతుండవచ్చు.కానీ కరోనా రోగులకు అందుతున్న ట్రీట్మెంట్ విషయంలో మాత్రం ఎక్కడా ఎలాంటి విమర్శలు లేవు. ఇంకా చెప్పాలంటే ప్రైవేట్ ఆస్పత్రిలో లభిస్తున్న కరోనా ట్రీట్మెంట్ కంటే రిమ్స్ ఆస్పత్రిలోనే అద్భుతమైన చికిత్స జరుగుతోందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మృత్యు ముంగిట్లోకి వెళ్లిన కరోనా రోగుల కి కూడా జాన్ రిచర్డ్ పునర్జన్మ ఇచ్చారు. ఆయన ద్వారా చికిత్స పొంది కరోనా నుండి పూర్తిగా కోలుకున్న రోగులు ఆయన ట్రీట్మెంట్ విధానాన్ని ప్రశంసిస్తూ వీడియోలు పెడుతునారు. తాజాగా ఆయనను ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ,ఎస్ పి సిద్దార్థ్ కౌశల్ ఘనంగా సన్మానించారు. కరోనా రోగుల పాలిట ఆశాకిరణంగా వెలుగొందుతున్న జాన్ రిచర్డ్స్ ప్రకాశం జిల్లాకే గర్వకారణం.