Pegasus: దేశ వ్యాపితంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగాసస్ ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై సుప్రీం కోర్టు నేడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై విచారణ జరిపేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారని చెప్పింది. నిపుణుల కమిటీ పనితీరును తామే పర్యవేక్షిస్తామని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం..పెగాసస్ పై వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలన జరిపి కోర్టుకు నివేదిక అందజేయాలని కమిటీని ఆదేశించింది. వ్యక్తుల గోప్యత హక్కు ఉల్లంఘన జరిగిందా లేదా అన్నది ఈ కమిటీ పరిశీలన చేస్తుందని సుప్రీం కోర్టు పేర్కొన్నది. తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
Pegasus: పార్లమెంట్ లో పెగాసస్ ప్రకంపనలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ఒక రోజు ముందు పెగాసస్ ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పెగాసస్ తో లక్ష్యంగా చేసుకున్న వారిలో 300 మందికిపైగా భారతీయులు ఉన్నట్లు కథనాలు వచ్చాయి. ఇందులో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పికే), తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, పలువురు కేంద్ర మంత్రలు, జర్నలిస్ట్ లు కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీంతో విపక్షాలు పార్లమెంట్ లోనూ, బయట ఆందోళన చేశాయి. పెగాసస్ ప్రకంపనల నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా జరగలేదు. ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున పార్లమెంట్ లో నిరసనలు వ్యక్తం చేశారు.
‘పెగాసస్’ పై విచారణకు నిపుణుల కమిటీ
దీనిపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశాలంటూ పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ల విచారణ జరిపిన సుప్రీం కోర్టు పలు మార్లు కేంద్ర ప్రభుత్వ స్పందనను కోరింది. అయితే దేశ భద్రత అంశాలు చర్చించడం మంచిది కాదన్న ఉద్దేశంతోనే ఈ వ్యవహారంలో తాము సవివరంగా అఫిడవిట్ దాఖలు చేయడం లేదని సుప్రీం ధర్మాసనానికి తెలియజేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఇంతకు ముందు తీర్పును రిజర్వ్ లో పెట్టింది. నేడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని సుప్రీం ధర్మాసనం తెలిపింది. దేశ పౌరుల పై వివక్షాపూరితమైన నిఘాకు తాము ఎన్నటికీ అనుమతించబోమని కోర్టు స్పష్టం చేసింది.