అరచేతిలో అమరిపోయేంత, దీర్ఘ చతురస్రాకారంలో ఉండే ఒక చిన్న ఎలక్ట్రానిక్ వస్తువు మనల్నిశాసిస్తూ, జేబులో పట్టేంత చిన్నగా ఉన్నా ప్రపంచాన్ని కళ్ల ముందు చూపిస్తుంది.. అందుకే అది ఒక మాయ. దాని తో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం ఫొటోలు, వీడియోలు తీసుకోవడం, ఫోన్ మాట్లాడడం, అవసరం ఉన్న దానికోసం వెదకడం, టికెట్లు బుక్ చేసుకోవడం కావలిసిన వస్తువులు కొనుక్కోవడం ఇలా దాదాపు అన్ని కూర్చున్న చోటునుండి కదలకుండా కాళ్ళ దగ్గరకు వచ్చేస్తున్నాయి. దీనికంతటికీ కారణం.. స్మార్ట్ ఫోనే. వివో-సీఎంఆర్ స్మార్ట్ ఫోన్ పై చేసిన సర్వేలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటో తెలుసుకుందాం..
భారతీయులు తమ పని గంటల్లో 1/3వ వంతు స్మార్ట్ ఫోన్ తో గడిపేస్తున్నారట. అంటే.. ఏడాదికి 1800 గంటలు ఫోన్తోనే గడిపేస్తున్నారు . గత పదేళ్లతో పోల్చితే 30 శాతం కంటే తక్కువ మంది మాత్రమే నెలకు చాలా సార్లు తమ కుటుంబ సభ్యులను, శ్రేయోభిలాషు లనుకలుస్తున్నారట. మిగతా వాళ్లు ఫోనే ప్రపంచం అనుకుంటు బ్రతికేస్తున్నారట. మూడింట ఒకరు ప్రతి ఐదు నిమిషాలకు ఒక సారి ఫోన్ చెక్ చేసుకుంటూనే ఉంటారట. ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్లతో చాట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు.
73 శాతం మంది కి ఫోన్ వాడకం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మానసికంగా , శారీరకంగా కూడా ఇబ్బంది తప్పదని తెలిసికూడా ఫోన్ వాడకం మానడం లేదు. ఐదుగురిలో ముగ్గురు ఫోన్కు దూరంగా ఉంటేనే సంతోషం గా గడపగలుగుతున్నాం అని చెబుతున్నారు. ప్రపంచం వేగంగా ముందుకు సాగేందుకు టెక్నాలజీ పాత్ర అమోఘం అనే చెప్పాలి. ఇండియా లో డేటా రేట్లు చవకగా ఉండటంతో ఇక్కడి యువత దానికి బానిసలుగా మారుతున్నారు. అంటే.. డేంజర్ జోన్లోకి వెళ్తున్నారు.
నోకియా ఇచ్చిన రిపోర్టు ప్రకారం.. భారతీయ కస్టమర్లు సగటున నెలకు 11 జీబీ డేటాను వినియోగిస్తున్నారు. ఈ విషయం మనల్ని భయపెట్టేదే.ఒకప్పుడు వ్యసనం అంటే పొగాకు, ఆల్కహాల్, పేకాట.. తదితరాలకు వాడేవాళ్లు. కానీ, ఇప్పుడు టెక్నాలజీకి అలవాటు పడి దానికి కట్టు బానిసలుగా మారిపోయారు ప్రజలు.
ఫోన్కు వీలైనంత దూరంగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఫోన్ ముట్టు కోకపోతే భరించలేం అనుకుంటే.. డీఅడిక్షన్ సెంటర్కు వెళ్తే మంచిది. డీఅడిక్షన్ సెంటర్కు వెళ్లి టెక్నాలజీ అనే బానిస సంకెళ్ల నుండి బయటపడడం చాల అవసరం.