ఆయనో పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. బాగా అనుభవజ్ఞుడు కూడా !అలాంటి ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది.ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని స్థాయిలో ఆయన అతి ప్రమాదకరమైన వార్నింగ్ ఇచ్చారు.అక్రమాలకు పాల్పడితే శాల్తీలు గల్లంతవుతాయని ఆయన హెచ్చరించటం జరిగింది.అది ప్రైవేటు సంభాషణల్లో కాకుండా బహిరంగంగానే ఆయన ఈ విధంగా హెచ్చరిక జారీ చేశారు దీంతో అవాక్కవడం అందరి వంతు అయింది. .ఇదే ఇప్పుడు దేశ రాజకీయాల్లో ట్రెండింగ్ టాపిక్ అయింది.
ఎవరాయన !ఇంతకీ ఏమన్నారు?
‘‘నేను ఈమధ్య చాలా ప్రమాదకర మూడ్లో ఉన్నాను..అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోను వదిలిపెట్టేది లేదు..మధ్యప్రదేశ్ను వదిలి వెళ్లిపోండి..లేదంటే మిమ్మల్ని 10 అడుగుల గొయ్యి తీసి పాతిపెడతాను జాగ్రత్త’’ అంటూ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ల్యాండ్ మాఫియాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.‘‘నేను తలచుకుంటే మీరు ఏమైపోయారన్నదీ ఎవరికీ తెలియకుండా చేస్తా‘‘నంటూ హౌషంగాబాద్లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అక్రమార్కులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.తమ ప్రభుత్వం మెరుగైన పాలనను అందిస్తోందని..ప్రభుత్వ పథకాలను ప్రజలు సరైన సమయంలో, ఎటువంటి లంచాలు ఇవ్వకుండా పొందగలుగుతున్నారని అన్నారు.
కాగా..ఖజ్రానా, కబుతార్ ఖానా ప్రాంతాల్లో ఇటీవల ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ దురాక్రమణలకు వ్యతిరేకంగా డ్రైవ్ చేపట్టింది. ఆయా ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చేసింది. ఈ సందర్భంగా వారిని ఉద్ధేశించి సీఎం ఇటువంటి ఘాటు హెచ్చరికలు చేశారు.ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ వార్నింగ్పై దేశవ్యాప్త చర్చ మొదలైంది.ఒక ముఖ్యమంత్రి ఈ తరహా వార్నింగివ్వటం సముచితమా అన్నది డిబేట్ గా మారింది.యధా ప్రకారం బిజెపి వర్గీయులు తమ పార్టీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వైపు నిలబడుతుండగా ప్రతిపక్ష పార్టీలు అది సమంజసమైన వైఖరి కాదని సన్నాయినొక్కులు మొదలెట్టాయి.