అమరావతి, ఫిబ్రవరి 16: అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా టిడిపి అభ్యర్థుల ఎంపిక జాబితా ఉంటుందని మంత్రి కాలవ శ్రీనివాసులు వెల్లడించారు.
టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శనివారం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది.
ముందుగా పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన సిఆర్పిఎఫ్ జవానుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
సమావేశంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, రావుల చంద్రశేఖర్లు మీడియాకు వెళ్లడించారు.
వారు వెల్లడించిన ముఖ్య అంశాలు
- రేపటి నుండే పార్లమెంట్ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించడం.
- పనితీరు, సమర్థత ఆధారంగా అభ్యర్థుల ఎంపిక.
- ఎన్నికల నోటిఫికేషన్కు ముందే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన.
- ఎన్నికల వ్యవహారాల కోసం ప్రత్యేకంగా స్ట్రాటజీ కమిటీ ఏర్పాటు.
- మానిఫెస్టో కమిటీ ఏర్పాటు బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుకు అప్పగింత.
- సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువేళ్లే అంశంపై ప్రణాళిక రూపకల్పన
తెలంగాణాలో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై పూర్తి అధికారం తెలంగాణ పార్టీ కమిటీకి అప్పగిస్తూ తీర్మానించడం జరిగిందని వారు తెలిపారు.
ఈ సమావేశంలో పలువురు మంత్రులు, పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు పాల్గొన్నారు.
సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతి రాజు గైర్హజరు అయ్యారు.