ఏపీలో రోజురోజుకూ వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య మాటలు కోటలు దాటుతున్నాయి. మాటల యుద్ధమే జరుగుతోంది రోజూ. ఢీ అంటే ఢీ అంటున్నారు రెండు పార్టీల నాయకులు. ఏమాత్రం తగ్గడం లేదు. బాప్ రే.. ఇవేం రాజకీయాలు దేవుడా.. అని ఏపీ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
చివరకు.. ఒకరిని మరొకరు బూతులు తిట్టే వరకు వెళ్తున్నారంటే పరిస్థితి అర్థం అవుతుంది. తాజాగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్.. టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి బూతులు మాట్లాడారని.. ఇదేం సంస్కారమని టీడీపీ సీనియర్ నేత చినరాజప్ప ధ్వజమెత్తారు.
డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది.. వైసీపీ నేతలు ఇంతలా బరితెగిస్తున్నారు ఎందుకు? జగన్ ప్రభుత్వానికి ఇదే చివరి చాన్స్. మళ్లీ వైసీపీకి ప్రజలు చాన్స్ ఇవ్వరు. వైసీపీ నేతలు బూతులు మాట్లాడుతూ సరికొత్త రాజకీయానికి తెర తీస్తున్నారు. బూతులు మాట్లాడి.. టీడీపీ అధినేత చంద్రబాబును అవమానపరిచిన ధర్మాన ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి. అమరావతిలో పెయిడ్ ఆర్టిస్టులతో వీళ్లు ఉద్యమం నడుపుతున్నారు.. అంటూ చినరాజప్ప.. మండిపడ్డారు.