నేడు దేశవ్యాప్తంగా మొదలైన రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్ ముగిసి ఎన్నికల్లో గెలుపొందిన వారిని ప్రకటించారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నాలుగు రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకోవడం ఎన్నికలకు ముందే ఖరారు అయిపోగా ఓటింగ్ సమయంలో కొన్ని నాటకీయ పరిణామాలు జరిగాయి. చివరికి అవన్నీ కౌంటింగ్ సమయంలో బయటపడ్డాయి.
తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో చెల్లని ఓట్లు వేశారు. వీరిలో ముగ్గురు ముందునుండే వైసీపీకి చేరువగా ఉన్న వల్లభనేని వంశీ, కరణం బలరాం మరియు మద్దాలి గిరి కాగా నాలుగో వ్యక్తి రాజమండ్రి నగరం ఎమ్మెల్యే అయిన ఆదిరెడ్డి భవాని. భవాని చేసిన పని పొరపాటు అని ఉండొచ్చేమో కానీ వీరు మాత్రం కావాలని టిడిపికి ఓటు వేయడం ఇష్టం లేక ఇలా చేశారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే నిజం అని కూడా అందరూ భావిస్తున్నారు.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వీరి ముగ్గురి ని టార్గెట్ చేస్తూ విప్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇంకా ఈ ముగ్గురు పోలింగ్ కు గైర్హాజరైనా లేదా వైసీపీకి ఓటు వేసిన వారిపై వేటు పడుతుంది. అందుకని ఈ ముగ్గురు టీడీపీ రెబల్స్ పోలింగ్ కు ఆలస్యంగా రాయడమే కాకుండా కావాలని చెల్లని ఓట్లు వేశారని అందరూ భావిస్తున్నారు.
ఇక వీరి పనిపడదాం అని రెడీ అవుతున్న బాబుకు ఒక్కసారిగా ఈ చెల్లని ఓటింగ్ ప్రక్రియ షాక్ గా ముందుకు వచ్చింది. ఇదిలా ఉండగా వల్లభనేని వంశీ పార్టీ నుండి సస్పెండ్ అయిన వ్యక్తి కావడం వల్ల తనకు విప్ వర్తించదు అని ఆయన వాదిస్తున్నారు. అంటే వీరు కావాలని చెల్లని ఓట్లు వేసినట్లేనా?