ఏపీలో సాధారణ ఎన్నికల వేడి మొదలవడంతో రాజకీయాలు ఎత్తులు.. పై ఎత్తులతో అదిరిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగ్ జపాంగ్ల జోరు మామూలుగా లేదు. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరి ఇప్పుడు తెలుగుదేశం కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. బైరెడ్డి శబరికి నంద్యాల పార్లమెంటు టికెట్ ఇచ్చేందుకు తెదేపా అధినాయకత్వం ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు కీలక నాయకులు చెబుతున్నారు. అయితే సోమవారం రాత్రి శబరి కి తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంటు టికెట్ వచ్చినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో కొందరు కీలక నాయకులు ఆమె అనుచరులు.. అభిమానులు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా మిఠాయిలు పంచిపెట్టి పెద్ద ఎత్తున బాణసించా కాల్చారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
వాస్తవానికి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి నందికొట్కూరులో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అక్కడ బలమైన నేత. 2004 ఎన్నికలలో ఆయన ఓడిపోయారు. అయితే నియోజకవర్గం నందికొట్కూరు ఎస్సీలకు రిజర్వు కావడంతో బైరెడ్డికి నియోజకవర్గంలో లేకుండా పోయింది. ఆ తర్వాత చంద్రబాబు ఆయనకు సీటు ఇవ్వలేదు. ఆ తర్వాత ఆయన పలు పార్టీలు మారారు. రాయలసీమ ప్రత్యేకంగా ప్రత్యేక రాష్ట్రంగా చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. చిన్న పార్టీ ఉద్యమాన్ని కూడా నడిపారు.. ఆ తర్వాత బిజెపిలోకి వెళ్లినా అక్కడ ఆయనకు అనుకున్న మైలేజ్ దక్కలేదు.
ఇప్పుడు అటు ఇటు తిరుగుతూ తిరిగి తన సొంత గూటికి చేరుతున్నారు. ఇక బైరెడ్డి కుమార్తె బైరెడ్డి శబరి కూడా కొంతకాలంగా టిడిపిలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు దీని దీనిపై క్లారిటీ వచ్చింది. నంద్యాల పార్లమెంట్ నుంచి టిడిపి తరఫున గత ఎన్నికలలో మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన సైలెంట్ గా ఉండడంతో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా శబరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తోంది.
శబరి రెడ్డి సామాజిక వర్గం కావడంతో పాటు మహిళా అభ్యర్థి కావడం బలమైన వాయిస్ ఉండడంతో శబరి నంద్యాల పార్లమెంటుకు టిడిపి తరఫున బలమైన అభ్యర్థి అవుతారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.