Elon Musk: ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఎక్స్ (ట్విట్టర్) సీఈవో ఎలాన్ మస్క్ మరో సారి వార్తల్లో నిలిచారు. మాజీ ఉన్నతోద్యోగులు షాక్ ఇచ్చారు. మస్క్ పై నలుగురు మాజీ ఉన్నతోద్యోగులు వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించాలని కోర్టులో దావా వేశారు. నలుగురు వ్యక్తులు కోర్టులో 128 మిలియన్ డాలర్లకు పైగా (రూ.1061,28,96,000) చెల్లించాలని దావా వేయడంతో మస్క్ మరో సారి వార్తల్లోకి ఎక్కారు.
మస్క్ ట్విట్టర్ (ఎక్స్)ను కొనుగోలు చేసిన తర్వాత పలువురు ఉన్నతోద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఒప్పందం ప్రకారం వారికి పరిహారం చెల్లించాల్సి ఉంది. అందులో భాగంగా ఒక ఏడాది వేతనంతో పాటు తమకిచ్చిన స్టాక్ అవార్డులకు విలువ కట్టి ఇవ్వాల్సి ఉందని దావాలో పేర్కొన్నారు. ఆ లెక్కన మొత్తం 128 మిలియన్ డాలర్లు రావాల్సి ఉంటుందని వెల్లడించారు.
కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టును ఆశ్రయించిన వారిలో మాజీలైన ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్, చీఫ్ లీగల్ కౌన్సెల్ విజయ గద్దె, జనరల్ కౌన్సెల్ సీన్ ఎడ్జెట్ ఉన్నారు. తమకు పరిహారం చెల్లించే ఉద్దేశం మస్క్ కు లేదని దావాలో పేర్కొన్నారు. అందుకే తమ తొలగింపులకు నిర్లక్ష్యం, ఉద్దేశపూరవ్క దుష్ప్రవర్తన వంటి అసంబద్ధ కారణాలు చూపారని ఆరోపించారు. ఆ స్థానాల్లో ఇతర కంపెనీల్లోని ఉద్యోగులను నియమించారని చెప్పారు. ట్విట్టర్ నుండి ఉద్వాసనకు గురైన చాలా మంది ఉద్యోగులు ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
2022 అక్టోబర్ లో ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అందు కోసం ఆయన ఒక్కో స్టాక్ కు 54.20 డాలర్ల చొప్పున 44 బిలియన్ డాలర్లు చెల్లించారు. ఆ తర్వాత ఈ సామాజిక మాధ్యమ సంస్థలో అనేక మార్పులు చేశారు. దాదాపు 75 శాతం మంది ఉద్యోగులను తొలగించారు. సంస్థ పేరును ట్విట్టర్ నుండి ఎక్స్ గా మార్పు చేశారు. కంటెంట్ మోడరేషన్ లోనూ అనేక మార్పులు తీసుకొచ్చారు.
Breaking: ఏడు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు