గత కొద్దికాలంగా ఏపీ కార్మిక శాఖ గుమ్మనూరు జయరాం అనూహ్య పరిణామాలతో వార్తల్లోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మంత్రి టార్గెట్గా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పిస్తోంది.
బెంజ్ కారును గిఫ్ట్గా పొందారని ఆరోపణలు గుప్పించిన టీడీపీ దానికి కొనసాగింపుగా తాజాగా మరిన్ని విమర్శలు చేసింది. అయితే ఈ క్రమంలో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది.
అయ్యన్న సంచలన విమర్శలు
మంత్రి గుమ్మనూరు జయరాం అక్రమాలు తారాస్థాయికి చేరాయని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. “సొంత గ్రామంలో భారీ ఎత్తున పేకాట డెన్లు నడుపుతూ ఇటీవలే దొరికిన మంత్రి బంధువులు ఘటన మరువకముందే.. ఈఎస్ఐ స్కాంలో బెంజ్ కారుతో అడ్డంగా బుక్కయిన మంత్రి పాత్ర సంచలనం రేపుతోంది. మంత్రి సొంత నియోజకవర్గమైన ఆలూరులో దాదాపు 450 ఎకరాలు కబ్జా చేసేందుకు మంత్రి గుమ్మనూరు జయరామే నేరుగా రంగంలో దిగడం కలకలం సృష్టిస్తోంది. ఓ ప్రైవేట్ కంపెనీ యాజమాన్యాన్ని బెదిరించి, భయపెట్టి ఇప్పటికే మంత్రి తన భార్య, మరదలు, బంధువులు పేరుతో వందల ఎకరాలు లాగేశారు. మిగిలిన భూములు అనుచరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.“ అని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు.
మంత్రి గారు ఏమంటున్నారంటే…
తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పందించారు. టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణల్ని మంత్రి గుమ్మనూరు జయరాం తీవ్రంగా ఖండించారు. మీడియా ముందుకు వచ్చి అయ్యన్నపాత్రుడు విమర్శలు చేస్తే పరువునష్టం కేసు వేస్తాను. ఖబడ్ధార్ అని అయ్యన్నపాత్రుడ్ని మంత్రి జయరాం హెచ్చరించారు. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా బీసీ మంత్రి అయిన తనపైన అభాండరాలు వేయటం క్షమించరాని నేరం అని స్పష్టం చేశారు. “గతంలో బెంజ్ మినిస్టర్ అన్నారు. కనీసం బెంజ్ కారులో ఒక చక్రం కూడా నాదని టీడీపీ నేతలు నిరూపించలేకపోయారు.“అంటూ ఎద్దేవా చేశారు.
బెంగళూరులో అలా జరిగిందా?
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని భూమిని ఎప్పుడు కొనుగోలు చేశారో పూర్తిగా తెల్సుకొని టీడీపీ నేతలు మాట్లాడాలని మంత్రి జయరాం కోరారు. “మను, మంజునాథ అనే అన్నదమ్ములు కలిసి భూములు కొనుగోలు చేశారు. ఆరోజు ఎకరా రూ.10వేలు ఉంటే వారు రూ.25వేల చొప్పన వేర్వేరు చోట్ల భూములు కొనుగోలు చేశారు. మంజునాథ తన ఆస్తిని అమ్ముతాను మీరు ఏమైనా కొనగలరా అని నా వద్దకు వచ్చారు. ఆ కాగితాలు సబ్రిజిస్ట్రార్కు చూపించాము. మంజునాథ నుంచి 100 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేశాను. మంజునాథ సోదరుడు కుమారుడు మను అనే అతను బెంగళూరులో కేసు వేశారని తెల్సింది. ఈ విషయంపై మంజునాథ ఫ్రాడ్ చేశారని తెల్సిన తర్వాత ఇద్దరిపైన నేను కేసు పెట్టాను. ఇద్దరు కలిసి భూములు అమ్మాలని ప్రతిపాదించిన వీడియో కూడా నా వద్ద ఉంది.“ అని మంత్రి కీలక వివరాలు వెల్లడించారు.
టీడీపీ చౌకబారు విమర్శలు…
మను, మంజునాథ మధ్య గొడవలుండగా… టీడీపీ నాయకులు ఇలా చౌకబారు విమర్శలు చేయటం ఏంటి అని జయరాం ప్రశ్నించారు. “టీడీపీ నాయకులకు, అయ్యన్నపాత్రుడుకు మతి భ్రమించి విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యేగా నామినేషన్ చేసినప్పుడు ఉన్న ఆస్తికి ఇప్పుడు ఇంత డబ్బు ఎలా వచ్చిందని అయ్యన్నపాత్రుడు అంటున్నారు. 2 ఎకరాల నుంచి ఈరోజు 2 లక్షల కోట్లు ఎలా దండుకున్నారని చంద్రబాబును టీడీపీ నేతలు ఎందుకు ప్రశ్నించరు అంటూ జయరాం నిలదీశారు. “చంద్రబాబు ప్రభుత్వంలో ధనిక వర్గానికి చెందిన బీసీలు ఉన్నారు. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో నిజమైన అట్టడుగు వర్గానికి చెందిన బీసీ వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారు. గతంలో టీడీపీలో చేరితే.. రూ.50 కోట్లు ఇచ్చి మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు ఆఫర్ ఇచ్చారు. అయినా టీడీపీలో చేరలేదు.“ అంటూ మంత్రి జయరాం సంచలన విషయాలను వెల్లడించారు.