(హైదరాబాద్ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) నివేదికను కోర్టుక అందజేయాలని హైకోర్టు ఆదేశించింది.
2017లో టాలివుడ్ డ్రగ్స్ కేసు విచారణపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన పిటిషన్పై నేడు హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. డ్రగ్స్ కేసులో అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఉన్నందున ఎక్సైజ్ పరిధి సరిపోదని రేవంత్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. విచారణను సీబీఐ లేదా ఈడీ, నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబీ) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని రేవంత్ రెడ్డి కోరారు.
ఈ కేసులో రేవంత్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదించారు. కేసును విచారించడానికి దర్యాప్తు సంస్థలు సిద్ధంగా ఉన్నా ఈడీ, ఎన్సిబీలకు రాష్ట్ర ప్రభుత్వం వివరాలు ఇవ్వడం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్ తరపు వాదనలు విన్న ధర్మాసనం..సిట్ దర్యాప్తు ఏ స్థితిలో ఉందో డిసెంబర్ 10వ తేదీలోగా నివేదికను కోర్టుకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది.