టీ కాంగ్రెస్ లో మాజీ మంత్రి కొండా సురేఖతో మొదలైన అసమ్మతి రాగం కొనసాగుతూనే ఉంది. ఒక్కరొక్కరుగా పీసీసీ కమిటీల ప్రకటనపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కమిటీల్లో ఎక్కువ భాగం అనర్హులకు చోటు కల్పించారంటూ సీనియర్ నేతలు పెదవి విరుస్తున్నారు. మాజీ మంత్రి కొండ సురేఖ ముందుగా తన అసంతృప్తిని వ్యక్తం చేసి తనకు ఇచ్చిన కమిటీ సభ్యత్వాన్ని తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. నేరుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ తర్వాత బెల్లయ్య నాయక్ కూడా తనకు రాజకీయ వ్యవహారాల కమిటీలో చోటు దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. ఆలానే మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి పేరు పీఏసీ లో గల్లంతు అవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
కమిటీలపై అసంతృప్తి వ్యక్తం అవుతున్న నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్య కోదండ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ వి హనుమంతరావు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వరరెడ్డి, ఓయూ నేతలు ఇటీవల సమావేశం నిర్వహించి ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. కమిటీల కూర్పు కసరత్తులో సీఎల్పీని భాగస్వామ్యం చేసి ఉంటే బాగుండేదని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. తాజాగా సీనియర్ నేత దామోదర రాజనర్శింహ సంచలన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ అయ్యింది. రీసెంట్ గా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ సోకిందని వ్యాఖ్యానించగా, తాజాగా అదే స్థాయిలో దామోదర రాజనర్శింహ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రమాదకరమైన జబ్బు సోకిందని, వెంటనే ప్రక్షాళన చేయాలని కోరడం తీవ్ర సంచలనంగా మారింది.
సోమాజీగుడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా బాధతతో ఈ ప్రెస్ మీట్ పెడుతున్నానన్నారు. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయం గురించి ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టినట్లు చెప్పారు. వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు ఉన్నాయని కానీ పార్టీ పరిస్థితి ఘోరంగా దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ డెలిగేట్స్ నుండి ఇదే విధంగా తప్పులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. కొత్త వారికి పదవులు ఇచ్చారనీ, 84 మంది జనరల్ సెక్రటరీలు అవసరమా అని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో కూడా ఇంత మంది జనరల్ సెక్రటరీలు లేరని అన్నారు. బలహీన వర్గాలకు కాంగ్రెస్ లో గుర్తింపు లేకుండా పోయిందనీ, కాంగ్రెస్ సిద్ధాంతాలు ఏంటో తెలియని వాళ్లకు పదవులు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ కు కోవర్ట్ ఇజం అనే ప్రమాదకరమైన జబ్బు సోకిందని రాజనర్శింహ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాట పాడుతూ ప్రభుత్వానికి మద్దతు పలికుతున్నారనీ, బీఆర్ఎస్ కు కొన్ని అనుకూల శక్తులు పని చేస్తున్నాయని ఆరోపించారు. అదే సమయంలో కోవర్టులకే కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటోందని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందనీ, కోవర్టుల వివరాలు ఆధారాలతో సహా సమాచారాన్ని ఏఐసీసీకి ఇచ్చామని తెలిపారు. తాను అధిష్టానాన్ని గౌరవిస్తానని .. కానీ ఆత్మగౌరవం తో బతుకుతానని రాజనర్శింహ అన్నారు. ఈ పరిణామాలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ కు తలనొప్పిగా మారుతున్నాయి.