Prakasam District: ప్రకాశం జిల్లా దర్శి వైసిపి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సోదరుడు మద్దిశెట్టి శ్రీధర్ తో ఫోన్ లో పరుషంగా మాట్లాడారన్న కారణం చూపి కనిగిరి విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం భాస్కర్ రావును సస్పెండ్ చేయడం జిల్లాలో హాట్ టాపిక్ అయింది.ఆ ఫోన్ కాల్ ఆడియో టేపును ఈఈ ఉద్దేశపూర్వకంగా మీడియాకు విడుదల చేసి ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారన్న అభియోగంపై ఆయనను సస్పెండ్ చేశారు.ఈ తరహా సస్పెన్షన్ జిల్లాలో దాదాపు ఇదే మొదటిదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
అసలేం జరిగింది?
మద్దిశెట్టి శ్రీధర్ కు విద్యుత్ శాఖతో ఒక పని పడింది.దానికి సంబంధించి ఆయన డిపాజిట్ డబ్బులు చెల్లించారు.అయితే చాలా కాలంగా ఆ పని పెండింగ్ లో ఉండిపోయింది.ఈ నేపధ్యంలో శ్రీధర్ విద్యుత్ శాఖ ఈఈ భాస్కర రావుకు ఫోన్ చేశారు.తన సొంత పనే పెండింగ్ లో ఉండిపోయిందని ఆయన నిష్టూరమాడారు.అయితే ఈఈ భాస్కర్ రావు ఇందుకు గల కారణాలను వివరిస్తూ వచ్చారు.వ్యవసాయ పరమైన పనులను ప్రాధాన్యత ప్రాతిపదికన చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.దీంతో ఎమ్మెల్యే సోదరునికి కోపం వచ్చింది.నా విషయాల్లో కూడా ప్రాధాన్యత ఉంటుందా అని ప్రశ్నించారు.తమాషాగా ఉందా అంటూ ఈఈ పైన ఫైర్ అయ్యారు.ఈ దశలో వాదన ముదిరింది.
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ని ఉద్దేశించి ఎమ్మెల్యే సోదరుడు నువ్వు నువ్వు అనడం మొదలుపెట్టారు.దీనికి ఆయన అభ్యంతరం చెప్పారు.నువ్వు అనొద్దని.. మర్యాదగా మాట్లాడాలని కోరారు.ఆయన ఎమ్మెల్యే సోదరుడు ఏకవచన సంబోధనను కొనసాగించడంతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా రియాక్ట్ అయ్యారు.మీరు ప్రభుత్వ ఉద్యోగితో మాట్లాడుతున్నారు.మీ ఇంటి పాలేరుతో కాదని ఆయన ఎమ్మెల్యే సోదరునికి కౌంటర్ ఇచ్చారు.మర్యాదగా మాట్లాడటం నేర్చుకోమనికూడా ఈఈ అన్నారు. వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్ ఆడియో టేపు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
చక్రం తిప్పిన ఎమ్మెల్యే సోదరుడు!
ఈఈ ఎదురుతిరిగినట్టు మాట్లాడటంతో ఎమ్మెల్యే సోదరుడికి ఇగో దెబ్బ తిన్నది.వెంటనే చక్రం తిప్పారు.విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.దీంతో విద్యుత్ శాఖ ప్రభుత్వ ఉద్యోగుల కోడ్ ఆఫ్ కాండక్ట్ ను ఈఈ భాస్కర్రావు ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న కారణంతో సస్పెండ్ చేశారు.అయితే రూల్ పొజిషన్ వివరిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ను తమాషాగా ఉందా..నువ్వు అంటూ మాట్లాడిన ఎమ్మెల్యే సోదరుడుది తప్పా?అలా మాట్లాడవద్దంటూ వారించిన ఈఈ ది నేరమా అన్నది ప్రజలే నిర్ణయించాలి.