Brahmamgari matham: బ్రహ్మం గారి మఠం పీఠాధిపతి వ్యవహారంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. బ్రహం గారి మఠం పీఠాధిపతి హోదా తమకే దక్కాలంటూ దివంగత పీఠాధిపతి రెండవ భార్య మారుతీ మహాలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ధార్మిక పరిషత్ చేసిన తీర్మానం నిబంధనలకు అనుగుణంగా లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రత్యేక అధికారికి ఉత్తర్వులు ఇచ్చే అధికారం లేదని, నిబంధనలకు విరుద్ధంగా జివో జారీ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ తరపు న్యాయవాది మాత్రం నిబంధనలకు అనుగుణంగానే జివో జారీ చేశామని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ధార్మిక పరిషత్ ఇచ్చిన తీర్మానం ఆధారంగానే ప్రత్యేక అధికారి ఉత్తర్వులు ఇచ్చామని ఆయన వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.