Congress Protests: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చలో రాజ్ భవన్ కార్యక్రమానికి తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇందిరా పార్క్ వద్ద 200 మంది తో సమావేశం నిర్వహణకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు చలో రాజ్ భవన్ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి బయలుదేరిన పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా పోలీసులు ఇళ్ల వద్దే నిర్బంధించారు. కార్యకర్తలు తరలి వెళ్లకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. అయనప్పటికీ ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు ఇందిరా పార్క్ వద్ద కు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు.
Read More: Revanth Reddy: రేవంత్ రివర్స్ ఆపరేషన్ ఆకర్ష్..! సక్సెస్ సంకేతాలు వస్తున్నట్లేగా..?
కొందరు యూత్ కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ వద్ద హాల్ చల్ చేశారు. రాజ్ భవన్ మెయిన్ గేటుకు పార్టీ జండాలు తగిలించి ఆందోళన చేశారు. ఇందిరా పార్క్ వద్దకు కొద్దిసేపటిలో రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. కాంగ్రెస్ చలో రాజ్ భవన్ నేపథ్యంలో రాజ్ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులు తమ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడం పట్ల టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరసన తెలిపేందుకు వస్తున్న నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని కనబరుస్తోందని, ఇతర జిల్లాల నుండి కార్యకర్తలు రాకుండా అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు మల్లు రవి. ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు అనుమతి ఇచ్చి మళ్లీ కార్యకర్తలను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. గృహ నిర్బంధాలు, అరెస్టు లు చేయడం రాచరిక పాలనకు నిదర్శనమని ఆక్షేపించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని మల్లు రవి డిమాండ్ చేశారు.