Asha Kandara: కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది ఆషా కందరా అనే మహిళ. రాజస్థాన్ రాష్ట్రం జోధ్ పూర్ ప్రాంతానికి చెందిన ఆషా ఎనిమిదేళ్ల క్రితం భర్త నుండి విడిపోయింది. జోధ్ పూర్ మున్సిపల్ కార్యాలయంలో స్వీపర్ గా పని చేస్తూ తన ఇద్దరు పిల్లలను పోషిస్తూనే డిగ్రీ పూర్తి చేసింది. పట్టుదలతో శ్రమించి రెండేళ్ల క్రితం రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్షలు రాసింది. తాజాగా వెలువడిన ఆ పరీక్ష ఫలితాల్లో తాను ఉత్తీర్ణత సాధించినట్లు తెలుసుకుని ఎంతో సంతోషం వ్యక్తం చేసింది.
వీధులు ఊడ్చే పని చేస్తూనే ఉన్నత లక్ష్యం వైపుకు అడుగులు వేసి ఆమె సక్సెస్ అయ్యింది. ప్రభుత్వం త్వరలో ఆమెకు డిప్యూటి కలెక్టర్ గా పోస్టింగ్ ఇవ్వనున్నది. స్వీపర్ ఉద్యోగం చేస్తూ కృషి, పట్టుదలతో ఆమె సాధించిన లక్ష్యం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. తమ కార్యాలయంలో పని చేస్తున్న ఓ చిరు ఉద్యోగి కష్టపడి చదువుకుని డిప్యూటి కలెక్టర్ స్థాయికి ఎదగడంపై మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు, అధికారులు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.