తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకు త్వరలో మరో షాక్ తగలనుందని ప్రచారం జరుగుతోంది.
ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా తెలుగుదేశం పార్టీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు పార్టీకి గుడ్ బై చెప్పేయడంతో సంఖ్య 19కి పడిపోయింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో టీడీపీ నుంచి వైసీపీలోకి మొదలైన వలసల సంఖ్య వాసుపల్లి గణేష్తో నాలుగుకి చేరుకుంది. ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. మరికొందరు కూడా సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు చేరతారని ప్రచారం జరుగుతోంది.
గంటా… ఆయనతో పెద్ద తంట
విశాఖలో కార్యనిర్వాహక రాజధానిని ఏర్పాటు చేయాలని సిద్ధమైన వైసీపీ ప్రభుత్వం అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి ప్రతికూలతలు రాకుండా చూసుకుంటోంది. ఇందులో పార్టీ ఫిరాయించే నేతల జాబితాలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ పేరు దీర్ఘకాలంగా వినిపిస్తోంది. అయితే, ఆయన విషయంలో వైసీపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం, గంటా సైతం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో గంటా జంపింగ్ ఆగిపోయింది. ఒకవేళ గంటా పార్టీ మారితే ఆయనతో పాటుగా మరో ముఖ్యనేత సైతం గుడ్ బై చెప్తారని అంటున్నారు. విశాఖ నుంచి మరో ఎమ్మెల్యే గణబాబు కూడా వైసీపీ శిబిరంలోకి వెళ్లడం ఖాయమని అంటున్నారు.
ఇంక భారీ జాబితే ఉంది
మరికొందరు నేతలు సైతం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ సైతం పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీలో ఆధిపత్య పోరుతో విసుగు చెందామని భవాని కుటుంబం ఆవేదన చెందుతోంది. వైసీపీ నుంచి ఎమ్మెల్యే భవానీకి గ్రీన్సిగ్నల్ రాలేదని అంటున్నారు. ఒకవేళ భవాని పార్టీ మారితే టీడీపీకి అది షాకింగ్ వంటిదని నిపుణులు పేర్కొంటున్నారు.
వీళ్లు కూడా లైన్లో ఉన్నారట
పార్టీ మార్పుపై కొన్ని రోజులుగా గుసగుసలు వినిపిస్తున్న జాబితాలో ప్రకాశం జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే గొట్టిపాటి రవి పార్టీ మార్పు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం తన మైన్స్పై కేసులు పెడుతోందని వాపోతున్న ఆయన పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నారని అంటున్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పర్చూరి సాంబశివరావు పేర్లపైనా బాగా చర్చ జరిగింది. చేరడం ఖాయం అని ప్రచారం జరిగింది. చంద్రబాబు జోక్యంతో చివరి నిమిషంలో ఆయన ఆగిపోయినప్పటికీ, త్వరలో పార్టీ ఫిరాయింపు ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలలో కరణం బలరాం వెళ్లిపోయిన దశలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు వినపడటం టీడీపీ నేతలను కలవరపాటుకు గురిచేస్తోందట.
బాబుకు దిమ్మతిరగడం ఖాయమా?
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేల జంపింగ్ జాబితా కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు హ్యాండిస్తే.. చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా పోతుందని లెక్కలు వేసుకుంటున్నారు. టీడీపీ వీడే ఎమ్మెల్యే లు ఎవరన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ ఊపందుకుంది.