తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ రాజకీయంగా మిగతా యువనేతల కంటే కొన్ని అడుగులు ముందున్న సంగతి తెలిసిందే.
పార్టీ నేతగా, పరిపాలన పరంగా కూడా కేటీఆర్ శైలి పలువురిని ఆకట్టుకుంటుంది. అయితే, తాజాగా హైదరాబాద్లో జరిగిన ఓ దారుణ ఘటన అనేకమందిని కలచివేసింది. నేరేడ్మెట్ దీనదయాల్ నగర్ లోని నాళాలో పడి చిన్నారి సుమేధ మరణించిన సంగతి తెలిసిందే.
సుమేధ తల్లిదండ్రుల ఫిర్యాదు
చిన్నారి సుమేధ తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్ , నగర మేయర్, జీహెచ్ఎంసీ కమీషనర్ , జోనల్ కమిషనర్, స్థానిక కార్పోరేటర్, సంబందిత ఈఈ, డీఈపై కేసు నమోదు చేయాలని పోలీసులకి ఫిర్యాదు చేశారు. పాప మృతికి కారణమైన వీరి అందరిపై 304 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని నెరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సుమేధ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో న్యాయవాది మామిడి వేణు మాధవ్ ఫిర్యాదు చేశారు. నగరంలో ఓపెన్ నాలల మృత్యు కుహరాలుగా మారుతూ పిల్లల ప్రాణాలు తీస్తున్నాయని, తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నాయంటూ పిటిషన్ దాఖలు చేశారు. వర్షాకాలంలో ఇటువంటి ఘటనలు తరుచుగా జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందంటూ ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఓపెన్ నాలలపై కప్పులు వేసి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చెయ్యాలని, ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేశించాలంటూ కమిషన్ కోరారు.
రంగంలోకి కేటీఆర్
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై పురపాలక మంత్రి కేటీఆర్ సమీక్షించారు. జీహెచ్ఎంసీతో సహా రాష్ట్రంలోని పురపాలికల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై చర్చించారు. మరో రెండు వారాల పాటు వానలు పడే అవకాశం ఉండడంతో ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వచ్చే రెండు వారాలు అధికారులు పూర్తిగా క్షేత్ర స్థాయిలో ఉండి పని చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
ఉద్యోగులకు షాకిచ్చిన కేటీఆర్
వర్షాల కోసం ప్రత్యేకంగా సీనియర్ అధికారులకు బాధ్యత అప్పగించాలని, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి తో పాటు కమిషనర్లు సైతం ఆకస్మిక తనిఖీలు చేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రస్తుతం సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదవుతోందని మంత్రి కేటీఆర్కి అధికారులు వివరించారు. ఒక్క హైదరాబాద్లోనే గత పది రోజుల్లో 54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని… ఈ స్థాయిలో గతంలో ఎన్నడూ వానలు పడడం లేదని తెలిపారు. ఒకట్రెండు గంటల్లోనే భారీగా వర్షం కురుస్తుండడం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయని తెలిపారు. ఉద్యోగులు అందరికీ సెలవులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. బలహీనంగా, కూలి పోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాలను వెంటనే గుర్తించి, కూల్చివేయాలని అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. ఇప్పటికే గుర్తించిన భవనాల కూల్చివేతల్ని వేగవంతం చేయాలన్నారాయన. భవన నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాల్సిందిగా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేయాలని మంత్రి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అలర్ట్
మరో రెండు వారాల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో… ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వర్షాల వల్ల పాడవుతున్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని మంత్రి కేటీఆర్సూచించారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాక… యుద్ధ ప్రాతిపదికన రోడ్లను పూర్తి స్థాయిలో బాగు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు మంత్రి. వర్షాలు తగ్గిన వెంటనే పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని కూడా మంత్రి ఆదేశించారు.