ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ భారీ అవినీతికి పాల్పడ్డారంటూ ఓ పత్రికలో వార్తలు రావడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
ఈ పరిణామంపై అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య విమర్శల పర్వం కొనసాగింది. అయితే, ఈ అక్రమాల విషయంలో లోకేష్ తండ్రి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు స్పందన ఏంటనే ఆసక్తి పలువురిలో వ్యక్తమైంది. ఈ విషయంలో తాజాగా ఆయన స్పందించారు.
లోకేష్ అవినీతిపై బాబు ఏమంటున్నారంటే…
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశం సందర్బంగా చంద్రబాబు తన తనయుడిపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రస్తావించారు. “చేయని తప్పుకు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారు. ఆయనను అరెస్ట్ చేసిన విధానం ఏ విధంగా ఉందో మనం చూశాం. అరెస్ట్ చేసిన తర్వాత కూడా వెంటాడారు. ఆసుపత్రిలో ఉన్నప్పటికీ అనేక ఇబ్బందులు పెట్టారు. భయపడితే మనం అనుకున్నది సాధించలేం. జగన్ మోహన్ రెడ్డి వైఫల్యాలను, అక్రమాలను ఎండగట్టాల్సిన అవసరం ఉంది. లోకేష్కు సంబంధం లేకపోయినా ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో సంతకం పెట్టారంటూ దుష్ప్రచారం చేశారు. మైండ్ గేమ్ ఆడుతున్నారు.“ అంటూ చంద్రబాబు స్పందించారు.
ఇంకో మాట కూడా అన్నారు
ఈ సందర్భంగా ఏపీలోని బీసీలు, ఎస్సీలపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. “మాస్కు అడిగిన పాపానికి ఓ దళిత డాక్టర్ సుధాకర్ పై కక్ష గట్టారు. పిచ్చోడని ముద్రవేశారు. కేసులో తీవ్రమైన అనుమానాలున్నాయని, కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజా చైతన్యానికి తెలుగుదేశం పార్టీ నాంది పలకాలి. ప్రజా చైతన్యనానికి తెలుగుదేశం పార్టీ నాంది పలకాలి. వైసీపీ నాయకుల వేధింపులను సమర్థంగా ఎదుర్కోవాలి. బాధిత వర్గాల ప్రజల్లో మనోధైర్యం నింపాలి. పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి. ప్రజల పట్ల మన బాధ్యత నిర్వర్తించాలి. ప్రజలు చైతన్యవంతులై వైసీపీ అరాచకాలపై తిరగబడే పరిస్థితి వచ్చింది.“ అని చంద్రబాబు తెలిపారు. టీడీపీని ఇబ్బందిపెట్టిన ప్రతిఒక్కరికీ వడ్డీతో సహా చెల్లిస్తాం.“ అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అచ్చెన్న ఆ ఇద్దరికి రుణ పడి ఉంటారట
ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తన జీవితాంతం టీడీపీకి రుణపడి ఉంటానని ప్రకటించారు. “జగన్ లాంటి దుర్మార్గ పాలన గతంలో ఎన్నడూ చూడలేదు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అక్రమంగా నన్ను ఇబ్బందిపెట్టినప్పుడు చంద్రబాబునాయుడు, పార్టీ యువనేత లోకేష్ చాలా మద్దతుగా నిలిచారు. మిగతా అందరూ అండగా నిలిచారు“ అని పేర్కొన్నారు. జగన్ పాలనలో వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అచ్చెన్నాయుడు తెలిపారు.