నిత్యం ఉత్పన్నమయ్యే చెత్త నుంచి పర్యావరణాన్ని, జీవరాశులను సంరక్షించడం ప్రభుత్వాలకు సవాల్ గా మారింది. కొందరు జనాలు చెత్తను ఎక్కడ పడితే అక్కడే వేస్తున్నారు. దీంతో ఆ చెత్తను తొలగించడంతోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచడం ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారుతోంది. అయితే ఆ పార్క్ వారు మాత్రం ఇలాంటి సమస్యకు వినూత్న పరిష్కారం కనిపెట్టారు. అదేమిటంటే…
థాయ్లాండ్ లోని బ్యాంకాక్ వద్ద ఉన్న ఖవో యై నేషనల్ పార్క్లో పర్యాటకులు ఎక్కడ పడితే అక్కడే చెత్తను వేస్తున్నారు. దీంతో చెత్తను తొలగించడం ఇబ్బందిగా మారింది. అలాగే అక్కడి వన్యప్రాణులకు చెత్త నుంచి ముప్పు ఏర్పడుతోంది. దీంతో పార్కు సిబ్బంది వినూత్న ఆలోచన చేశారు. పార్కుకు వచ్చే పర్యాటకుల చిరునామాలను సేకరిస్తున్నారు. వారు పార్కులో ఎక్కడైనా చెత్త వేస్తే దాన్ని సేకరించి తిరిగి వారు ఇచ్చిన చిరునామాకే ఆ చెత్తను డబ్బాల్లో పెట్టి డెలివరీ చేస్తున్నారు. దీంతోనైనా వారు ఆ పార్కులో చెత్తను వేయకుండా ఉంటారని ఆ పార్క్ సిబ్బంది చెబుతున్నారు.
https://www.facebook.com/TOPVarawut/photos/a.674770099640932/1058560754595196/?type=3
https://www.facebook.com/TOPVarawut/photos/a.674770099640932/1058560797928525/?type=3
ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను అక్కడి పర్యావరణ శాఖ మంత్రి వరవుత్ శిల్పా అర్చా ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. మీరు వేసిన చెత్తను మీకే పంపిస్తున్నాం.. అంటూ చెత్తను బాక్సుల్లో ఉంచిన ఫొటోలను షేర్ చేశారు. కాగా ఆ పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక చెత్త సమస్యను పరిష్కరించేందుకు ఇలాంటి వినూత్న కార్యక్రమం చేపట్టిన ఆ పార్కు సిబ్బందిని అందరూ అభినందిస్తున్నారు. కాగా ఆ పార్కు మొత్తం 2వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా.. దాన్ని 1962లో ఏర్పాటు చేశారు. ఇందులో అనేక రకాల జాతులకు చెందిన వన్యప్రాణులు జీవిస్తున్నాయి. పర్యాటకులు వేసే చెత్త వల్ల వాటి ప్రాణాలకు ముప్పు కలుగుతుందని చెప్పి ఆ పార్కు సిబ్బంది ఈ ఆలోచన చేశారు.