Nimmagadda Ramesh .. కోర్టులో గెలిచిన నిమ్మగడ్డ Nimmagadda గెలవాల్సిన కీలక పరీక్ష ఇంకోటి ఉంది. అది రాజకీయంగా. ఎస్ఈసీ నిమ్మగడ్డకు రాజకీయాలతో సంబంధం లేదు. అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఇందుకు ఊతమిస్తున్నాయి. ఇప్పటికే చర్చనీయాంశంగా మారిన ఎన్నికలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఉండని ట్విస్టులు, ఎత్తుకు పైఎత్తులు, వాదోపవాదాలు, విమర్శల ప్రస్తుతం ఉన్నాయి. ఎన్నికల సమయంలో రెండు పార్టీల మధ్య పోటీ ఉంటుంది. కానీ.. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో మాత్రం అధికార పార్టీకి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు మధ్య పోటీ నెలకొనడం ఇక్కడ విశేషం. దాదాపు ఏడాదిగా జరుగుతున్న ఈ యుద్ధానికి ఇటివలే తెర పడింది. ఇప్పటికైతే ప్రభుత్వంపై పైచేయి సాధించిన నిమ్మగడ్డ మరింత సాధించాల్సింది ఉంది. కానీ.. అది సాధ్యమవుతుందా.. అనేదే ప్రశ్న.
Nimmagadda Ramesh : వైసీపీపై కఠినం.. టీడీపీపై సానుభూతి..
ఎస్ఈసీ నిమ్మగడ్డ టీడీపీకి కొమ్ము కాస్తున్నారని, చంద్రబాబు చెప్పినట్టు చేస్తున్నారని, సామాజికవర్గంపై ఉన్న అభిమానంతో చంద్రబాబుకు ఫేవర్ చేస్తున్నారని మొదటి నుంచి మండిపడుతోంది అధికార పక్షం. ఈ విషయంలో వైసీపీ మొదటి నుంచీ గట్టి ప్రభావమే చూపింది. ఎన్నికలు వాయిదా వేసింది అందుకేనని ప్రజల్లోకి బలంగానే తీసుకెళ్లింది. అయితే.. తనకు ఆ ఉద్దేశం లేదని నిరూపించే ప్రయత్నాలేవీ నిమ్మగడ్డ చేయలేదు. ఆయనతో సంబంధం లేదని టీడీపీ కూడా గట్టిగా చెప్పలేదు. చట్టాలను ఉపయోగించుకుని నిమ్మగడ్డ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ టీడీపీ ముందుకెళ్లాయి. పంచాయతీ ఎన్నికలకు మ్యానిఫెస్టో విడుదల చేసారు.. 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు. కానీ.. ఇందుకు టీడీపీకి నోటీసులు మాత్రమే ఇచ్చిన నిమ్మగడ్డ.. వైసీపీ ప్రభుత్వానికి చెందిన ప్రతి విషయంలో కర్ర కాల్చి వాత పెడుతున్నారు. సజ్జల, ప్రవీణ్ ప్రకాశ్, డీజీపీ, ఇద్దరు కలెక్టర్లు, ఐఏఎస్ లు.. వీరందరిని పంచాయతీ ఎన్నికల నిర్వహణ నుంచి తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ.. టీడీపీపై మాత్రం నోటీసులకు ఎక్కువ.. బుజ్జగింపులకు తక్కువ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
వైసీపీకి దొరికిన ఆయుధం ఇదే..
ఇదే ఇప్పుడు వైసీపీకి వరంలా మారింది. ప్రజల్లోకి నిమ్మగడ్డ వ్యవహారాన్ని బలంగా తీసుకెళ్లాలి. ఇదే ప్రభుత్వ వ్యూహం. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం దిగి వచ్చేలా చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసు నెగ్గి నిమ్మగడ్డ చాలా ఆత్మస్థైర్యంతో ఉన్నారు. టీడీపీని, నిమ్మగడ్డను ఇప్పుడు ఒకేసారి దెబ్బ కొట్టాలంటే ప్రభుత్వం నుంచి వీరి చర్యలను విమర్శిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇప్పుడు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తోంది ఇదే. నిమ్మగడ్డపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వీరి వ్యాఖ్యలపై గవర్నర్, హైకోర్టుల వరకూ వెళ్లారు ఎస్ఈసీ. నిమ్మగడ్డ వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం మాత్రమే కాకుండా.. సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేయడం వంటివి చేస్తున్నారు. ఇలా ప్రభుత్వం నిమ్మగడ్డను ఇరుకున్న పెట్టే ప్రయత్నాలే చేస్తోంది. ఒకరో ఇద్దరో కాదు.. మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి నిమ్మగడ్డ, టీడీపీపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు. ఇది ప్రజలకు అర్ధమైతే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా టీడీపీకి వ్యతిరేకమే అవుతుందని.. తమకు లాభిస్తుందనేది వైసీపీ ఆలోచన. అయితే..
Nimmagadda Ramesh నిమ్మగడ్డ నిరూపించుకుంటారా..?
అనూహ్యంగా ఇటివలి కడప పర్యటనలో నిమ్మగడ్డ వైఎస్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన వల్ల తాను ఎంత లబ్ది పొందానో చెప్పుకొచ్చారు. ఇవేమీ వైసీపీ నేతలకు సాంత్వన చేకూర్చేవి కావు. యుద్ధం మొదలయ్యాక ఇక వెనక్కు తగ్తేది ఉండదు. ఈ విషయంలో నిమ్మగడ్డ, వైసీపీ ప్రభుత్వం దూకుడుగానే వెళ్తున్నాయి. ఇక్కడ ఎవరూ తగ్గరనేది తెలిసిన విషయమే. అయితే.. జరుగుతున్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడమే ఇక్కడ ఇద్దరి లక్ష్యం కూడా. ఈ క్రమంలో నిమ్మగడ్డ వ్యవహారంలో వైసీపీ ఒక అడుగు ముందుకే వేస్తోంది. 2018లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నిమ్మగడ్డ రమేశ్ ఎస్ఈసీగా ఉన్నారు. అప్పుడు నిర్వహించాల్సిన ఎన్నికలు నిర్వహించకపోవడం, గత ఏడాది సీఎం జగన్ పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉంటే నిమ్మగడ్డ వాయిదా వేయడం, ప్రస్తుతం టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయడం, ఎస్ఈసీ సీరియస్ గా ఆ విషయాన్ని తీసుకోకపోవడం.. వైసీపీ ప్రభుత్వానికి కలిసొచ్చేవే. ఈ విషయంలోనే నిమ్మగడ్డ వైసీపీ ప్రభుత్వం పైచేయి సాధించాల్సిన అంశాలు. మరి.. ఈ ఎన్నికలు పూర్తయ్యేలోపు గానీ.. ఆయన పదవీ విరమణ చేసే సమయంలోపు గానీ నిమ్మగడ్డ నిరూపించుకుంటారో లేదో చూడాలి.