హైదరాబాదు: స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికల్లో టిఆర్ఎస్ తన సత్తా చాటుకుంది. ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో టిఆర్ఎస్ అభ్యర్థులే ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఖంగుతిన్నది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి.
వరంగల్లు స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై 827ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
నల్లగొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మిపై టిఆర్ఎస్ అభ్యర్థి చిన్నపరెడ్డి, రంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్రెడ్డిపై మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఎమ్మెల్సి ఎన్నికల్లో విజయం సాధించిన టిఆర్ఎస్ నేతలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్లు అభినందించారు.
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించడంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికల్లోనూ సత్తా చాటాలని కాంగ్రెస్ నేతలు భావించారు. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపి విస్తృత ప్రచారం జరిపినప్పటికీ అధికార టిఆర్ఎస్ అభ్యర్థులే ఎన్నికల్లో విజయం సాధించారు.