అమరావతి: జగన్ ఆశయాలకు అనుగుణంగా కార్యకర్తలు అందరూ పని చేయాలని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సూచించారు. టిడిపిని ప్రజలు ఎందుకు ఓడించారో వివరిస్తూ వైసిపి శ్రేణులు ఎలా వ్యవహరించాలో ట్విట్టర్ వేదికగా సోమవారం సూచించారు.
అధికారం అంటే దోచుకోవడం, దాచుకోవడమేనని పచ్చ పార్టీ వాళ్లు అనుకున్నారని విజయసాయి రెడ్డి విమర్శించారు. అందుకే ప్రజలు వారిని తరిమి కొట్టారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు, ‘మనం మాత్రం దీనిని ఒక పవిత్ర బాధ్యతగా భావించాలి. ప్రజలిచ్చిన అఖండ మెజారిటీ వారికి సేవ చేసేందుకు మాత్రమే అని అర్థం చేసుకోవాలి. జగన్ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలి’ అని విజయసాయి రెడ్డి అన్నారు.
‘తానేం చేసినా అడ్డుకోరాదని చంద్రబాబు ఒక ఉద్యమమే చేశారు. సిబిఐ బ్యాన్ చేశారు. ఇటి దాడులను అడ్డుకున్నారు. ఈడి ఎలా వస్తుందని గుడ్లురిమారు. సిబిఐని రాష్ట్రంలోకి అనుమతిస్తూ జగన్ ఆదేశాలు జారీ చేశారు. దొంగలను రక్షించేది లేదని తేల్చి చెప్పారు. చూస్తున్నారా చంద్రబాబు?’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.