(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
రాష్ట్రంలో, దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతునే ఉన్నాయి. కరోనా బారిన సామాన్యులు, ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు పడుతున్నారు. తాజాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇతర రాజకీయ ప్రముఖులు, ప్రజా ప్రతినిధుల మాదిరిగా ఆయన కూడా తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు వెళ్లి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు ఇప్పటికే కరోనా బారిన పడి వైద్య చికిత్సల అనంతరం కోలుకోగా ఇంకా కొందరు ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి రెండవ సారి కరోనా సోకడంతో చెన్నై లోని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అదే విధంగా చిత్తూరు ఎమ్మెల్యే కూడా కరోనా బారిన పడి చెన్నై లోని ఆసుపత్రిలోనే చేరారు. కాగా నిన్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు రెండవ సారి కరోనా లక్షణాలు కనబడటంతో హెలికాఫ్టర్ లో హైదరాబాదు తరలివెళ్ళి అపోలో ఆసుపత్రిలో చేరి వైద్యసేవలు పొందుతున్నారు.
ప్రస్తుతం హైదరాబాదులో చికిత్స పొందుతున్న వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది. రెండు రోజుల క్రితమే టీటీడీ పాలకవర్గ సమావేశం జరిగింది. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా నిర్ధారణ కావడంతో అక్కడి అధికారులలో, ఇటీవల కాలంలో వైవీ సుబ్బారెడ్డి ని కలిసిన నాయకుల్లో ఆందోళన మొదలైంది.