శ్రీనగర్, జనవరి 26: జమ్ము-కాశ్మీర్లోని శ్రీనగర్ జిల్లా ఖోన్మో ప్రాంతంలో శనివారం భద్రతా దళాలతో జరిగిన కాల్పులో జైష్ ఏ మహమ్మద్ (జెఇఎం) సంస్థకు చెందిన ఇద్దరు తీవ్రవాదులు మృతి చెందారు. భధ్రతా దళాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు పోలిస్ సిబ్బంది గాయపడ్డారు. శ్రీనగర్లో గణతంత్ర దినోత్సవాలను లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు దాడి పథకం రచించుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. మృతి చెందిన వారి వద్ద రెండు ఎకె 47 రైఫిళ్లు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఈ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
ఇంటిలిజెన్స్ అధికారుల సమాచారంతో ఉగ్రవాదుల రహస్య స్థావరాలను కనుగొనేందుకు జమ్ము,కాశ్మీర్ పోలీసు సిబ్బంది, సిఆర్పిఎఫ్ స్పెషల్ ఆపరేషన్ (ఎస్ఒజి) గ్రూప్ ఖోన్మో ప్రాంత్రంలో తనిఖీలు నిర్వహిస్తున్నది.
గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని శ్రీనగర్ ప్రాంతంలో భద్రతా చర్యలు పటిష్టం చేశారు.