వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పలు అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా భారీగా అభ్యర్థుల మార్పులు, చేర్పులు చేస్తున్నారు. చాలామందికి స్థానాచలనం జరుగుతుంది. ఏలూరు పార్లమెంటు పరిధిలో పలు నియోజకవర్గాలలో అభ్యర్థులను మారుస్తున్నారని ప్రచారం జరిగినా ప్రస్తుతానికి చింతలపూడిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాను పక్కన పెట్టి ఆ స్థానంలో మాజీ బ్రేక్ ఇన్స్పెక్టర్ కంభం విజయ రాజుకు ఛాన్స్ ఇచ్చారు. పోలవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలరాజుకు బదులుగా ఆయన భార్యకు అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా చింతలపూడి సీటు మార్పు విషయంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తో పాటు నియోజకవర్గ వ్యవహారాల్లో కీలక నేతగా ఉన్న కెవిపి రామచంద్ర రావు బావమరిది మేడవరపు అశోక్ బాబు పట్టుబట్టి మరి విజయరాజుకు సీటు వచ్చేలా చక్రం తిప్పారు.
చింతలపూడి నియోజకవర్గంలో ఏలూరు ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ తో పాటు అశోక్ బాబు వర్గం చాలా బలంగా ఉంది. శ్రీథర్కు ఇది చింతలపూడి సొంత నియోజకవర్గం. ఎలీజా ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాది నుంచి ఈ వర్గంతో వైరం పెట్టుకున్నారు. చివరకు ఎన్నికలకు ముందు కూడా ఈ గొడవలు ఇలాగే కొనసాగాయి. ఎంపీ మిథున్రెడ్డి పలుమార్లు ఎలీజాకు బలంగా ఉన్న ఎంపీ వర్గంతో గొడవలు వద్దని చెప్పినా పంతానికి పోయి చివరకు సీటు పోగొట్టుకున్నారు. జగన్ సైతం ఎలీజాకు సీటు లేదని చెప్పినప్పుడు బలమైన ఎంపీ వర్గం సహకరించదు.. నువ్వు ఓడిపోతావ్ అని చెప్పే అమలాపురం లోక్సభకు పోటీ చేయమని సలహా ఇచ్చారు.
విజయరాజు ప్లస్లు ఇవి…
ఇక కొత్త ఇన్చార్జ్గా వచ్చిన విజయరాజుకు చాలా పార్టీ పరంగా, స్థానికత, ఆర్థిక అండదండలు అన్ని విషయాల్లోనూ ప్లస్లే ఉన్నాయి. విజయరాజు స్వస్థలం లింగపాలెం మండలం మఠంగూడెం. ఆయన పుట్టిపెరిగిందంతా కామవరపుకోట. ఆయన జంగారెడ్డిగూడెంలో ఉద్యోగిగా చాలా యేళ్లపాటు పనిచేయడంతో విస్తృత పరిచయాలున్నాయి. దీనికి తోడు 2009 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఆయన కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ సీటు కోసం ట్రై చేస్తూనే వస్తున్నారు. దీంతో స్థానిక వైసీపీ కేడర్తో ఎప్పటి నుంచో అనుబంధం ఏర్పడింది. అటు కొయ్యే మోషేన్రాజు వియ్యంకుడు కావడం కూడా అనేక కారణాల రీత్యా చాలా ప్లస్. పైగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పోలిస్తే ముందుగా తన అభ్యర్థిత్వం ఖరారు కావడంతో నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా దూసుకుపోతూ ప్రజలకు చేరువ అవుతున్నారు.
ఎంపీ శ్రీథర్కు ఇది అసలు సిసలు పరీక్ష :
ఐదేళ్ల పాటు ఎంపీగా చిన్న రిమార్క్ లేకుండా, వివాదాలకు దూరంగా ఉన్న ఎంపీ కోటగిరి శ్రీథర్ ఈ సారి ఎన్నికల్లో తాను పోటీ చేయనని జగన్కు ఎప్పుడో ఆరు నెలల ముందే చెప్పేశారు. తాను ఫుల్ టైం రాజకీయాలకు కొనసాగించాలని అనుకున్నప్పుడే తిరిగి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పేశారు. నాలుగేళ్లుగా చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజా తీరుతోనే శ్రీథర్ బాగా విసిగిపోయారు. ఎలీజా సహాకారం లేకే ఆయన తన సొంత నియోజకవర్గాన్ని కూడా తాను అనుకున్నట్టుగా అభివృద్ధి చేయలేకపోయారు. అందుకే పట్టుబట్టి జగన్ / మిథున్రెడ్డి ద్వారా తన సొంత సీటులో తాను అనుకున్న క్యాండెట్కే సీటు వచ్చేలా చేశారు. సీటు విషయంలో సక్సెస్ అయిన శ్రీథర్ ఈ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయరాజును గెలిపించడమే ఇప్పుడు ఆయన సత్తాకు అసలు సిసలు నిదర్శనం.