urvashi radadiya: చాలా మంది వ్యక్తులకు సెలబ్రిటీలంటే అభిమానం ఉంటుంది. మరికొందరికి వీరాభిమానం ఉంటుంది. అభిమానం మరీ ఎక్కువైతే పాలాభిషేకాలు, రక్త దానాలు, అన్న దానాలు చేస్తూ ఉంటారు అభిమానులు. కానీ ఇప్పుడు ఓ సింగర్ ని అభిమానించే ఫ్యాన్స్ చేసిన పనికి అందరూ నోరెళ్లబెడుతారు. వీరు తమకిష్టమైన గాయనిపై అభిమానం చాటుకునేందుకు బకెట్లతో కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. ఈ నోట్ల సత్కారానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ అభిమానులు ఎవరు? వారు అంతగా అభిమానించే ఆ గొప్ప గాయని ఎవరు? ఇది ఎక్కడ జరిగింది? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరా సింగర్?
గుజరాత్ రాష్ట్రానికి చెందిన శ్రీ సమస్త్ హరిద్వార్ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల ఒక కచేరీ జరిగింది. ఈ సంగీత కచేరికి జానపద గాయని ఊర్వశి రాధాదియా విచ్చేశారు. ఆమె తన మధురమైన గాత్రంతో తన టీంతో కలిసి పాటలు ఆలపించడం ప్రారంభించారు. ఆమె పాట వింటూ అందరూ మైమరిచి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె గానానికి మంత్రముగ్ధులైన కొందరు అభిమానులు కరెన్సీ నోట్లను బకెట్లలో తీసుకొచ్చి ఆమె మీద కుమ్మరించారు. స్టేజి ముందు కింద నిలుచున్న మరి కొందరు అభిమానులు ఆమెపై కరెన్సీ నోట్లను విసిరేసి తమ అభిమానాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. వారు కురిపించిన కరెన్సీ వర్షానికి అక్కడ అంతా డబ్బుతో నిండిపోయింది. కుప్పలుతెప్పలుగా కరెన్సీ నోట్లు తనపై కనిపిస్తున్నప్పటికీ ఆ గాయని చాలా శాంతంగా వ్యవహరించారు. తనపై అభిమానం చూపుతున్న వారందరికీ కృతజ్ఞత భావం తెలిపినట్లు చిరునవ్వు నవ్వారు.
ఆమె టాలెంట్ ఏంటి?
అయితే బకెట్లతో కరెన్సీ నోట్లు కుమ్మరిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో ఇదేం అభిమానం అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఇది అభిమానానికి నిలువెత్తు నిదర్శనం అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. అత్యుత్తమ గుజరాతీ జానపద గాయనిగా ఊర్వశి రాధాదియా పేరు తెచ్చుకున్నారు. దేశ భక్తి, జానపద పాటలు పాడే ఆమె ఎంతో మంది మనసులు గెలుచుకున్నారు. గుజరాత్ సీఎం కూడా ఆమెను ప్రశంసించిన సందర్భాలున్నాయి.